ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రులతో ప్రత్యేకంగా సమావేశం.. రేవంత్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 16, 2025, 12:46 PM

సీఎం రేవంత్ రెడ్డి సోమవారం మంత్రులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరగనున్న ఈ క్యాబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఇటీవలే ప్రమాణం చేసిన కొత్త మంత్రులు వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ ఈ సమావేశంలో పాల్గోనున్నారు. వారి పరిచయ కార్యక్రమం కూడా ఉంటుంది. కొత్త మంత్రులకు వారి శాఖల బాధ్యతలు, ప్రభుత్వం లక్ష్యాలపై సీఎం దిశానిర్దేశం చేసే ఛాన్స్ ఉంది. క్యాబినెట్ భేటీలో ప్రధానంగా నాలుగు అంశాలపై చర్చ జరుగుతుందని తెలుస్తోంది. రైతు భరోసా, స్థానిక ఎన్నికలు, రాజీవ్ యువ వికాసం, కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు.. ఏపీ చేపట్టేందుకు సిద్ధమైన బనకచర్ల ప్రాజెక్టుపైనా క్యాబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం వానాకాలం సీజన్ ముందుగానే ప్రారంభమైనందున రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పథకం అమలు, గత యాసంగి పెండింగ్ నిధుల చెల్లింపులపై క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గత మాదిరికాకుండా వారం రోజుల్లోపు చెల్లింపులు పూర్తి చేయడంపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకం పురోగతిపై కూడా క్యాబినెట్ సమావేశంలో సమీక్ష జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై క్యాబినెట్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన సన్నాహాలు, పార్టీ వ్యూహాలపై కూడా మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలా.. లేదా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలా..? అనేదానిపై మంత్రుల అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి తెలుసుకోనున్నారు. దానికి తగ్గట్టు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక ప్రకటన చేశారు. ఈ నెలాఖరులో నోటిఫికేషన్ వస్తుందని, క్యాబినెట్ లోచర్చించిన తరువాత ఎన్నికల తేదీలపై ప్రకటన చేస్తామని చెప్పారు. దీంతో ఇవాళ జరిగే క్యాబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది.. ఎన్నికలు ఎప్పుడు జరగనున్నాయనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు.. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఎన్డీఎస్ఏ నివేదికలు, విజిలెన్స్ నివేదికలు.. అలాగే ప్రస్తుతం విచారణలో ఉన్న ఇతర ముఖ్యమైన కేసులపైనా క్యాబినెట్ లో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నట్లు సమాచారం. అంతేకాక.. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టుపైకూడా క్యాబినెట్ లో చర్చించే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa