ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేసీఆర్ ఆ విషయం గురించి పదే పదే చెప్పేవారు: ఈటల రాజేందర్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 16, 2025, 06:46 PM

తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనా తీరు, కేబినెట్ సమావేశాల నిర్వహణ, ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆయన వెల్లడించిన వివరాలు తీవ్ర చర్చకు దారి తీశాయి. తన పార్టీ నిబద్ధతను, రాజకీయ ప్రత్యర్థులపై తన వైఖరిని స్పష్టం చేస్తూ.. మీడియా ప్రతినిధులతో జరిగిన చిట్ చాట్‌లో ఈటల కీలక వ్యాఖ్యలు చేశారు.


కేసీఆర్ పాలనలో కేబినెట్ నిర్ణయాలు..


కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పాలనా విధానం ఎలా ఉండేదో ఈటల రాజేందర్ తన అనుభవాలను పంచుకున్నారు. ‘కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి పదిహేను రోజులకొకసారి తప్పనిసరిగా కేబినెట్ సమావేశం జరిగేది. మంత్రులుగా మేము తీసుకున్న చిన్నపాటి నిర్ణయాలను కూడా కేబినెట్ ముందు ఉంచండి, కేబినెట్ అనుమతి తీసుకోండి అని ఆయన మాకు పదేపదే సూచించేవారు’ అని ఈటల గుర్తు చేసుకున్నారు. ఇది గత ప్రభుత్వంలో పాలనా వ్యవహారాల్లో పారదర్శకత, సమిష్టి నిర్ణయాలకు ప్రాధాన్యత ఇచ్చేవారనడానికి నిదర్శనంగా ఆయన చూపారు.


కాళేశ్వరం ప్రాజెక్టు వంటి భారీ ప్రాజెక్టుల విషయంలోనూ ఇదే విధానం ఉండేదని ఈటల స్పష్టం చేశారు. ‘కాళేశ్వరం మీద కూడా ప్రతీ చిన్న విషయాన్ని కేబినెట్లో కూలంకుషంగా చర్చించాము’ అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టుపై కొనసాగుతున్న విచారణ, ప్రభుత్వాల మధ్య విమర్శల నేపథ్యంలో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కాళేశ్వరం అంశంపై తాను, కేసీఆర్, హరీష్ రావులు విచారణ కమిషన్ ముందు ఒకే మాట చెప్పామనడం సరికాదని, నాటి నిర్ణయాలు సమిష్టిగా తీసుకున్నవేనని ఈటల వివరించారు. కుంగిన పిల్లర్లను బాగు చేయించకుండా రైతుల నోట్లో మట్టి కొట్టవద్దని, మేడిగడ్డ బ్యారేజీని తక్షణమే పునరుద్ధరించి, రైతులకు భరోసా కల్పించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.


ఈటల రాజేందర్ తన రాజకీయ వైఖరిని స్పష్టం చేస్తూ.. కేసీఆర్‌ను రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తానని పునరుద్ఘాటించారు. ‘భూలోకంలో నాకు నరకాన్ని చూపిన వ్యక్తి కేసీఆర్’ అని బీఆర్‌ఎస్‌లో తన గత స్మృతులను గుర్తు చేసుకున్నారు. కేసీఆర్‌ ఎదురైతే నమస్కారం పెట్టే సంస్కారం తనకు ఉందని, అది తన వ్యక్తిగత గుణమని వివరించారు.


తెలంగాణలో బీజేపీ సొంతంగా అధికారంలోకి వచ్చే సత్తా ఉందని.. బీఆర్‌ఎస్‌తో విలీనం తమకెందుకని ప్రశ్నించారు. హైడ్రా పేరుతో పేదలను రేవంత్ టచ్ చేశారు.. అదే కాంగ్రెస్ పతనానికి పునాది వేసిందని ఆరోపించారు. 40 ఏళ్ల క్రితం పట్టా ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు ఇళ్లను కూల్చేస్తే ఎలా అని ప్రశ్నించారు. మరో 20 ఏళ్లపాటు కాంగ్రెస్‌కి ఓటేసే పరిస్థితి లేదంటూ ఈటల తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, కేంద్రం నుంచి అనేక ప్రాజెక్టులు తెలంగాణకు తీసుకువచ్చామని కిషన్‌రెడ్డి తరచుగా చెబుతుంటారు. టెక్స్‌టైల్ ప్రాజెక్ట్, జహీరాబాద్‌లోని ఇండస్ట్రియల్ పార్క్, పసుపు బోర్డు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటివి బీజేపీ కృషి వల్లనే వచ్చాయని, కాంగ్రెస్ మంత్రులు తమ వల్లనే వచ్చాయని చెప్పుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఈటల మండిపడ్డారు. "మా వల్లనే వచ్చాయని చెప్పుకుంటున్నవారిని ఈడ్చి కొట్టాలి" అని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. హైదరాబాద్ మెట్రో నెక్స్ట్ ఫేజ్‌కు కేంద్రం సహకారం అందిస్తుందని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈటల రాజేందర్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్రమైన వాదోపవాదాలకు అద్దం పడుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa