తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా కార్యక్రమం కింద ఖరీఫ్ సీజన్కు సంబంధించిన పెట్టుబడి నిధులు సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి వీటిని లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. గత రబీ సీజన్కు సంబంధించి.. పలు ప్రాంతాల్లోని చాలా మంది రైతులకు, ముఖ్యంగా నాలుగు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నవారికి ఇప్పటికీ నిధులు చేరలేదు. అప్పటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆలస్యం జరుగుతుందని.. అందరికీ సహాయం అందుతుందని రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ నాయకులు గతంలో హామీ ఇచ్చినా.. రబీ బకాయిలు ఇప్పటికీ జమ కాకపోవడంతో సదరు రైతులు తీవ్ర అయోమయంలో ఉన్నారు. తమకు ఇక ఈ సాయం రానట్టేనా అని లోలోపల చర్చించుకుంటున్నారు.
రబీ బకాయిల సమస్య..
గత రబీ సీజన్లో.. పైలట్ గ్రామాలలో మినహా.. పలు చోట్ల నాలుగు ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకే రైతు భరోసా మొత్తం చేరింది. ఆ పైన భూమి ఉన్న మిగిలిన అన్నదాతలకు ఆనాటి సాయం అందని పరిస్థితి నెలకొంది. ఎన్నికల హామీలో భాగంగా ఎటువంటి పరిమితులు లేకుండా అందరికీ రైతు భరోసా అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. ఆర్థిక కారణాల వల్ల కొంతమందికి రాలేదు. అప్పటి నిధులు పూర్తి స్థాయిలో అందకముందే, ఇప్పుడు ఖరీఫ్ సీజన్కు సంబంధించిన రైతు భరోసాను విడుదల చేయడంతో.. గతంలో బకాయిలున్న రైతుల్లో ఆందోళన ఎక్కువైంది. ఈసారైనా తమకు పూర్తిగా నిధులు అందుతాయా లేదా అనే సందేహంలో ఉన్నారు.
ఒకవేళ స్థానిక ఎన్నికల నేపథ్యంలో కేవలం ఖరీఫ్ సీజన్ డబ్బులు మాత్రమే జమ చేసి.. రబీ సీజన్ బకాయిలు ఇక రావని సంకేతాలు వస్తే.. అది తమకు పెద్ద అన్యాయమని నాలుగు ఎకరాల పైన భూమి ఉన్న రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు రైతులు, 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. నాలుగు ఎకరాలలోపు ఉన్న వారికి రబీ, ఖరీఫ్ రెండు సీజన్లకు (డబుల్ ధమాకా) నిధులు అందినందుకు కొంతమంది మిగతా వారిని వ్యంగ్యంగా చూస్తున్నారు. రెండుసార్లు రైతు భరోసా పొందిన వారిని చూసి, ఒక్కసారి మాత్రమే సాయం అందిన రైతులు కూడా తమకు అప్పటి రబీ, ఇప్పటి ఖరీఫ్ రెండు సీజన్ల డబ్బులు రావాలని కోరుకుంటున్నారు.
ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడి..
గతంలో రబీ సీజన్ రైతు భరోసా అందక ఇబ్బంది పడిన రైతులు, వాటి కోసమే ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. వారి ఆశలను తీర్చకుండానే మళ్లీ ఖరీఫ్ సీజన్ నిధులు ఖాతాల్లోకి వేయడం ప్రారంభించడం వారికి మరింత అయోమయాన్ని పెంచింది. ఈ సమస్యపై స్పష్టత ఇవ్వాలని.. అప్పుడు రైతు భరోసా రానీ నాలుగు ఎకరాల పైబడిన రైతులకు ఖరీఫ్, రబీ రెండు సీజన్లకు సంబంధించి నిధులు జమ చేయాలని ముధోల్ తాలూకా బీఆర్ఎస్ సమన్వయ నాయకులు కిరణ్ కొమ్రేవార్ ప్రభుత్వాన్ని కోరారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో... ప్రభుత్వం రైతుల మధ్య ఉన్న ఈ అసంతృప్తిని తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్ని వర్గాల రైతులకు న్యాయం చేసి, వారికి పూర్తి ఆర్థిక భరోసా కల్పించడం ద్వారానే ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోగలరు. రైతు భరోసా పథకం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం.. అన్నదాతలను అప్పుల ఊబి నుంచి బయటపడవేయడం, వ్యవసాయ పెట్టుబడికి సాయం అందించడం. ఈ లక్ష్యం నెరవేరాలంటే.. పథకం అమలులో ఎలాంటి వ్యత్యాసాలు ఉండకూడదని రైతులు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి... రబీ బకాయిలపై స్పష్టమైన ప్రకటన చేసి, అర్హులైన ప్రతి రైతుకు నిధులు అందేలా చూడాలని కోరుతున్నారు.
ఇదిలా ఉండగా.. ఈ సారి ఎకరాలతో సంబంధం లేకుండా.. అందరికీ రైతు భరోసా అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో నేటి వరకు 3 ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో ఖరీఫ్ సీజన్ నిధులు జమ అయ్యాయి. రేపటి నుంచి 4 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa