ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజాసింగ్ ఆరోపణల్లో నిజం లేదన్న అధికార ప్రతినిధి రాణి రుద్రమ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 30, 2025, 08:33 PM

తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపికపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది. మంగళవారం ఉదయం కొత్త అధ్యక్షుడి పేరును అధికారికంగా ప్రకటించనున్నట్లు పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, అధ్యక్ష ఎన్నికల ప్రక్రియపై వస్తున్న ఆరోపణలను పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఎన్నికలు పూర్తిగా పారదర్శకంగా జరుగుతున్నాయని, ఎలాంటి వివాదాలకు తావులేదని తేల్చిచెప్పారు. తాను నామినేషన్ వేస్తానంటే అడ్డుకున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై పలువురు నాయకులు స్పందించారు.అధ్యక్ష ఎన్నిక ప్రక్రియపై ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ, పార్టీ నిబంధనల ప్రకారమే ఎన్నిక అత్యంత ప్రజాస్వామ్యబద్ధంగా సాగుతోందని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ నామినేషన్ వేసే అవకాశం కల్పించామని, 10 మంది సభ్యులు ప్రతిపాదించిన తర్వాతే నామినేషన్ స్వీకరిస్తున్నామని ఆయన వివరించారు. ఈ ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేవని, మీడియాలో వస్తున్న ఊహాగానాల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని వేద కన్వెన్షన్‌లో కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటిస్తారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి వెల్లడించారు.మరోవైపు, అధ్యక్ష ఎన్నికల ప్రక్రియపై ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన ఆరోపణలను బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ తీవ్రంగా ఖండించారు. రాజాసింగ్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, ఆయన క్రమశిక్షణ రాహిత్యం పరాకాష్టకు చేరిందని ఆమె విమర్శించారు. బీజేపీకి వ్యక్తుల కంటే పార్టీ సిద్ధాంతాలే ముఖ్యమని స్పష్టం చేశారు. రాజాసింగ్ నిజంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటే ఆ లేఖను స్పీకర్‌కు సమర్పించాలని సూచించారు. పార్టీ అధ్యక్షుడికి ఇచ్చిన రాజీనామా లేఖను జాతీయ నాయకత్వానికి పంపుతున్నట్లు రాణి రుద్రమ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa