కొందరు వైద్యులు తమ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆందోళన కలిగిస్తోంది. రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతూ.. చికిత్స అందించడంలో శ్రద్ధ చూపకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అత్యవసర పరిస్థితుల్లోనూ రోగులను పట్టించుకోకుండా ఫోన్లు, ఇతర వ్యక్తిగత పనులతో కాలక్షేపం చేయడం వంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇది ప్రజల్లో వైద్య వృత్తి పట్ల అపనమ్మకాన్ని పెంచుతోంది.
ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, కొందరు వైద్యుల్లోని బాధ్యతారాహిత్యం కారణంగానే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని రోగులు, వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా.. రోగులకు వైద్యం అందించాల్సిన ఓ డాక్టర్ తన మొబైల్ ఫోన్లో క్యాండీ క్రష్ గేమ్ ఆడుతూ నిమగ్నమైపోవడం నాగర్కర్నూల్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో కలకలం రేపింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న లేడీ డాక్టర్ తన విధులను పక్కనపెట్టి సెల్ఫోన్ గేమ్లో నిమగ్ననమైంది. రోగులు క్యూలో వేచి ఉన్నప్పటికీ వారిని పట్టించుకోలేదు. సెక్యూరిటీ గార్డు ద్వారా రోగులను బయటే నిలిపివేసి.. డాక్టర్ మాత్రం తన స్మార్ట్ఫోన్లో 'క్యాండీ క్రష్' గేమ్ ఆడుతూ కాలక్షేపం చేశారు. కింది స్థాయి వైద్య సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ.. ఉన్నతాధికారి అయిన డాక్టర్ ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల అక్కడి రోగులు, వారి బంధువులు విస్మయం వ్యక్తం చేశారు. అంతకు కొద్దిసేపటి ముందే ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్ ఆసుపత్రిని తనిఖీ చేసి వెళ్లిన తర్వాతే ఈ ఘటన చోటుచేసుకోవడం మరింత చర్చనీయాంశమైంది.
ఉన్నతాధికారుల పర్యవేక్షణా లోపంతోనే వైద్యులు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రోగులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో పేదలకు వైద్యం అందుతుందననే నమ్మకంతో వస్తామని.. కానీ ఇలాంటి నిర్లక్ష్యం తగదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఆసుపత్రి సూపరింటెండెంట్.. క్యాండీ క్రష్ ఆడిన డాక్టర్ ఆయేషాకు మెమో జారీ చేశారు. మూడు రోజుల్లోగా ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని ఆమెను ఆదేశించారు. సరైన వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలు ఉంటాయని ఆసుపత్రి వర్గాలు హెచ్చరించాయి.
కాగా, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్నారు. చాలా కాలంగా తలనొప్పి, ముక్కు దిబ్బడ, సైనసైటిస్, శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆమె.. స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో విజయవంతంగా శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటన ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంచేలా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ప్రశంసించారు. మరోపక్క ఆయేషా లాంటి డాక్టర్ల చర్యతో ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కోల్పోయేలా వ్యవహరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa