తెలంగాణ నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ భారీ శుభవార్త తెలిపారు. సోమవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో జరిగిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన.. మరో రెండేళ్లలో లక్ష కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించి.. నిరుద్యోగులను ఆదుకునే బాధ్యతను స్వయంగా తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 50 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఇది నిరుద్యోగ యువతలో నూతన ఆశలను చిగురింపజేసింది.
గత భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పాలనలో నోటిఫికేషన్లు ఇచ్చి.. మళ్లీ వారే కోర్టుల్లో కేసులు వేయించి, నిరుద్యోగుల జీవితాలతో ఆట ఆడుకున్నారని ఆయన ఆరోపించారు. అలాంటి బీఆర్ఎస్కు రాబోయే స్థానిక ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్పాలని ప్రజలకు సూచించారు.
‘అసెంబ్లీ ఎన్నికల్లో మమ్మల్ని మీరు గెలిపించారు, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించారు. ఇన్ని చేసిన మిమ్మల్ని లోకల్ బాడీ ఎన్నికల్లో గెలిపించుకునే బాధ్యత మాది’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. స్థానిక ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా బీఆర్ఎస్ గెలవకుండా చూడాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవం అని సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాతో కాంగ్రెస్ పార్టీకి విడదీయరాని బంధం ఉందని, జిల్లా అభివృద్ధి అంతా కాంగ్రెస్ పాలనలోనే జరిగిందని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి పదేళ్లు పాలించే అవకాశం ఇచ్చినప్పటికీ, గోదావరి నీళ్లు తుంగతుర్తికి ఎందుకు తేలేదని సీఎం ప్రశ్నించారు.
ఇది నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని సూచిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి, నిరుద్యోగుల ఉపాధికి కట్టుబడి ఉందని, తాజా ఉద్యోగ హామీ దానిలో భాగమేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రకటనలు రాబోయే స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ ఆశలను పెంచుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa