ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్లాసులో సోడా పోసినంత ఈజీ కాదు.. గోదావరి నీళ్లు తేవడం: సీఎం రేవంత్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 14, 2025, 07:38 PM

సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, తిరుమలగిరిలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించారు. ‘గ్లాసులో సోడా పోసినంత సులభం కాదు గోదావరి నీళ్లు తేవడం’ అంటూ గత ప్రభుత్వ హయాంలో భారీ నీటిపారుదల ప్రాజెక్టుల అమలు తీరును ఎద్దేవా చేస్తూ.. పరోక్షంగా జగదీశ్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ మాటల యుద్ధం సభలో రాజకీయ వేడిని మరింత పెంచింది.


కాంగ్రెస్ పార్టీ రాబోయే పదేళ్లపాటు తెలంగాణలో అధికార పీఠంపై ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా ప్రకటించారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)ని పూర్తిగా తుడిచిపెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఉమ్మడి నల్గొండ జిల్లాతో కాంగ్రెస్ పార్టీకి ఎనలేని అనుబంధం ఉందని.. జిల్లా అభివృద్ధి అంతా కాంగ్రెస్ పాలనలోనే జరిగిందని ఆయన ఘంటాపథంగా చెప్పారు.


నల్గొండ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో.. ఆనాటి మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ నాగార్జున సాగర్‌ను నిర్మించి నల్గొండ జిల్లాకు సాగునీరు అందించారని సీఎం గుర్తు చేశారు. నాగార్జున సాగరే కాకుండా.. శ్రీశైలం, ఎస్సార్‌ఎస్‌పి వంటి అనేక భారీ నీటిపారుదల ప్రాజెక్టులు ఆనాడు కాంగ్రెస్ పార్టీయే నిర్మించిందని, అవే నేటి తెలంగాణ రైతాంగానికి జీవనాధారంగా నిలిచాయని ఆయన వివరించారు. ఈ నల్గొండ జిల్లాలో ప్రవహించే మూసీ నదిని కూడా ఆనాడే కాంగ్రెస్ పార్టీ ఆధునీకరించిందని తెలిపారు.


బీఆర్ఎస్ పార్టీకి పదేళ్లపాటు పాలించే అవకాశం లభించినప్పటికీ.. గోదావరి నీళ్లు తుంగతుర్తికి ఎందుకు తేలేదని ముఖ్యమంత్రి జగదీశ్ రెడ్డిని నేరుగా ప్రశ్నించారు. ‘మూడు రోజులు అవకాశం ఇస్తే గోదావరి జలాలు తుంగతుర్తి నియోజకవర్గానికి తెస్తా’ అని జగదీశ్ రెడ్డి వార్తాపత్రికల్లో ప్రకటన ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘మూడు రోజులు కాదు, పదేళ్లు మీకు పాలనా పగ్గాలు అప్పజెప్పారు. మరి ఎందుకు దేవాదుల నుంచి తుంగతుర్తికి నీళ్లు తీసుకురాలేదు..? గోదావరి జలాలతో ఈ ప్రాంత భూములను ఎందుకు తడపలేదు? అని నిలదీశారు. ‘అయ్యా, గ్లాసులో సోడా పోసినట్టు కాదు గోదావరి జలాలు తుంగతుర్తికి తేవడం అంటే. నీకు తెలిసిన విద్య ఒక్కటే.. దొరగారి ముందు చేతులు కట్టుకొని గ్లాసులో సోడా పోయడమే కానీ, అంతకు మించి నీకు మరే విద్య లేదు’ అని తీవ్ర స్థాయిలో విమర్శించారు.


పదేళ్లు మంత్రిగా ఉండి కూడా.. సొంత మండలానికి ఒక ఎంఆర్ఓ ఆఫీసు, ఎంపీడీఓ ఆఫీసు, పోలీస్ స్టేషన్ కూడా తెచ్చుకోలేని సన్నాసివి అంటూ నిప్పులు చెరిగారు. తమ ముందు సామెతలు వల్లెవేస్తూ.. సిగ్గుతో తలవంచుకోవాల్సింది పోయి, ముఖ్యమంత్రిని, ప్రభుత్వ కార్యక్రమాన్ని అడ్డుకుంటానని ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు. ‘ఏదొక్కసారి అడ్డుకొని చూడు.. మా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసుకుంటారు. నా పక్కనే రామరెడ్డి దామోదర్ రెడ్డి ఉన్నారు. మా దామన్న ఒక్కడు ఈ నియోజకవర్గంలో కూర్చుంటే అడ్డుకునేటోళ్ళు ఎవరో, అడ్డం పడేటోళ్ళు ఎవరో.. వాళ్ళ కథ ఏందో, వాళ్ళ కమామిస్ ఏందో దామన్ననే తేల్చగలడు’ అని హెచ్చరించారు.


ఇవన్నీ తాను మాట్లాడగలనని, కానీ ఇది అధికార కార్యక్రమం కాబట్టి ఎక్కువ తక్కువ చెప్పదలుచుకోలేదని, విషయం అర్థమైతే అర్థమైనట్టేనని వేదిక మీద నుంచి సూచన చేశారు. అంతేకాకుండా.. రాబోయే రెండున్నర సంవత్సరాలలో నిరుద్యోగులకు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. నల్గొండ జిల్లాకు ఇటీవల నాలుగు ఎమ్మెల్సీలలో మూడు దక్కాయని గుర్తు చేశారు.


చివరగా.. రేషన్ కార్డులు ఇవ్వాలన్నా ఇందిరమ్మ రాజ్యంలోనే, సన్న బియ్యం పెట్టాలన్నా ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యం అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులు పండించిన వడ్లకు కనీస మద్దతు ధర ఇవ్వడమే కాకుండా రూ.500 బోనస్ ఇవ్వాలన్నా ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమని పేర్కొన్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.2 లక్షల రుణమాఫీ ద్వారా 2,55,968 మంది రైతులకు రూ.21 వేల కోట్ల మేర రుణ విముక్తి కల్పించిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వమేనని అన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa