ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్ మెట్రో .. 640 కి.మీ వరకు విస్తరణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 15, 2025, 07:44 PM

భవిష్యత్తు హైదరాబాద్ మహానగరం రవాణా అవసరాలను తీర్చడానికి.. మెట్రోరైల్ విస్తరణ ఎంతో కీలకమని లీ అసోసియేట్స్ అధ్యయన సంస్థ తన నివేదికలో స్పష్టం చేసింది. 2050 నాటికి నగర జనాభా 3.5 కోట్లకు చేరుతుందని అంచనా వేసిన ఈ సంస్థ. అప్పటికి 640 కిలోమీటర్ల మేర మెట్రో నెట్‌వర్క్‌ను విస్తరించాలని ప్రతిపాదించింది. దీని ద్వారా సుమారు 65 లక్షల మందికి పైగా నిత్యం మెట్రో సేవలను వినియోగించుకోగలుగుతారని పేర్కొంది. ఈ బృహత్తర విస్తరణ ప్రణాళికను నాలుగు దశలుగా చేపట్టాలని సూచించింది.


ప్రభుత్వం చేపట్టిన సమగ్ర మాస్టర్‌ప్లాన్ 2050లో భాగంగా.. హైదరాబాద్ మహానగరం రీజనల్ రింగ్‌రోడ్డు వరకు విస్తరించిన దృష్ట్యా, అన్ని వైపులా రవాణా అనుసంధానతను పెంపొందించాల్సిన అవసరం ఉందని లీ అసోసియేట్స్ తేల్చి చెప్పింది. ఈ సంస్థను సమగ్ర రవాణా ప్రణాళికపై కన్సల్టెన్సీగా నియమించారు. రోడ్లు, ఇతర రవాణా సదుపాయాలు, ఎంఎంటీఎస్‌తో పాటు మెట్రో సేవల విస్తరణపై ఈ సంస్థ సమగ్ర అధ్యయనం చేస్తోంది.


రెండో దశలో 8 మార్గాల్లో మెట్రో విస్తరణకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ దశ 2030 నాటికి వినియోగంలోకి వస్తే.. మెట్రో ప్రయాణికుల సంఖ్య 15 లక్షలకు పెరుగుతుందని అంచనా. ఈ దశ పూర్తి కావడంతో 231.5 కిలోమీటర్ల మెట్రో మార్గం అందుబాటులోకి వస్తుంది. ఇందులో కొత్తగా 162.5 కిలోమీటర్ల మేర మెట్రో మార్గం సృష్టించబడుతుంది.


మూడో దశలో.. 2040 నాటికి పెరిగే జనాభా అవసరాలను పరిగణనలోకి తీసుకొని.. మెట్రోను 340 కిలోమీటర్ల వరకు విస్తరించాలని లీ అసోసియేట్స్ అంచనా వేసింది. మూడో దశ అందుబాటులోకి వస్తే.. మెట్రో ప్రయాణికుల సంఖ్య 35 లక్షలు దాటవచ్చని అంచనా. ఇలా క్రమంగా విస్తరిస్తూ.. 2050 నాటికి మొత్తం 640 కిలోమీటర్ల మెట్రో మార్గాలను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ఈ అధ్యయనం చెప్పింది. లీ అసోసియేట్స్ తన తుది నివేదికను సెప్టెంబర్‌లో ప్రభుత్వానికి సమర్పించనుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేయడంలో మెట్రోరైల్ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా (హెచ్‌ఎంఏ) పరిధి విస్తరణతో.. ప్రస్తుతం ఇది 11 జిల్లాల (హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సిద్దిపేట్, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి, నల్లగొండ, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వికారాబాద్)లోని 104 మండలాలు, 1355 గ్రామాలను కలుపుకొని ఉంది. ఈ విస్తరించిన ప్రాంతానికి సంబంధించిన ఆర్థికాభివృద్ధి ప్రణాళికపై అధ్యయనం చేసి.. సమగ్ర ప్రాజెక్టు నివేదికను సమర్పించే బాధ్యతను ప్రభుత్వం క్రిసిల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కన్సల్టెన్సీ సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ కూడా త్వరలోనే తన నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది.


క్రిసిల్ సంస్థ నగరంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 35 ఆర్థిక మండలాలు, లాజిస్టిక్ హబ్‌లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ప్రపంచంలోని టాప్–10 నగరాల సరసన హైదరాబాద్‌ను నిలబెట్టేందుకు అమలు చేయాల్సిన భవిష్యత్తు ఆర్థిక ప్రణాళికలపై క్రిసిల్ నివేదికను అందించనుంది. ఈ సమగ్ర ప్రణాళికలు హైదరాబాద్‌ను కేవలం రవాణా సౌలభ్యంతోనే కాకుండా, ఆర్థికంగా కూడా ఉన్నత స్థాయికి చేర్చడంలో దోహదపడతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa