తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని పొందాలన్నా.. ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డు తప్పనిసరిగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆరు గ్యారెంటీల అమలుకు రేషన్ కార్డు ప్రాముఖ్యత మరింత పెరిగింది. అంతేకాకుండా.. కేంద్ర ప్రభుత్వ పథకాలకు కూడా రేషన్ కార్డును ఒక ప్రామాణిక పత్రంగా అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో.. కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు, లేదా దరఖాస్తు చేసుకొని ఇప్పటివరకు కార్డు మంజూరు కాని వారి కోసం ప్రభుత్వం కీలక ప్రకటనలు చేసింది.
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ 2025 జూలై 14 నుండి ప్రారంభమైంది. ప్రభుత్వం ఇప్పటికే 3 లక్షలకు పైగా కార్డులను లబ్ధిదారులకు అందజేసింది. జూలై 13 వరకు స్వీకరించిన దరఖాస్తులన్నింటినీ సమగ్రంగా పరిశీలించి, సుమారు 5 లక్షల మందికి కొత్త కార్డులను మంజూరు చేసినట్లు పౌరసరఫరాల శాఖ వెల్లడించింది.
అయితే.. భౌతికంగా (ఫిజికల్) కార్డుల పంపిణీకి ఇంకా కొంత సమయం పడుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే తెలియజేశారు. ప్రింటింగ్ ప్రక్రియ కొనసాగుతోందని, త్వరలోనే అందరికీ కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం కార్డు రాని వారు మీసేవా ఆన్లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గత దరఖాస్తుల్లో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే.. మరోసారి సరిదిద్ది దరఖాస్తు సమర్పించాలని కూడా తెలిపారు. మీ దరఖాస్తు ఫారం రిజెక్ట్ అయితే.. దానిని స్టేటస్ తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ.. అవసరమైన పత్రాలు
కొత్త రేషన్ కార్డుల కోసం మీసేవా కేంద్రాల వద్దకు వెళ్ళినప్పుడు, అక్కడ లభించే దరఖాస్తు ఫారమ్ను నింపాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుడు తన ఆధార్ కార్డుతో పాటు, నివాస ధృవీకరణ పత్రాలను కూడా తప్పనిసరిగా సమర్పించాలి. ఈ పత్రాలను పీడీఎఫ్ రూపంలో ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సరైన పత్రాలు లేకుండా దరఖాస్తు చేస్తే, కొత్త రేషన్ కార్డు మంజూరుతో పాటు పాత కార్డుల్లో మార్పులు కూడా సాధ్యం కావు, దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తి వివరాలను, సరైన పత్రాలను సమర్పించడం ముఖ్యం.
పాత కార్డుల్లో కుటుంబ సభ్యులను చేర్చుకోవడానికి కూడా మీసేవా అప్లికేషన్ ఫారమ్ను నింపాలి. చేర్చాల్సిన వారి ఆధార్ కార్డులు, ఇంటి చిరునామా పత్రాలను సమర్పించడం అవసరం. మీ దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత, అది అధికారుల లాగిన్కు చేరుతుంది. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం, మీరు అర్హులైతే కార్డు మంజూరు చేస్తారు.
నిరంతర ప్రక్రియ..
కార్డు రానివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలో రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ప్రభుత్వం తెలియజేసింది. అర్హులు ఎప్పుడైనా మీసేవా ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 89 లక్షల రేషన్ కార్డులు ఉండగా, అదనంగా 95 లక్షల కొత్త కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనితో పాత, కొత్త కార్డులతో కలిపి మొత్తం లబ్ధిదారుల సంఖ్య 3 కోట్ల 10 లక్షలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.
మీకు రేషన్ కార్డు మంజూరైందా లేదా అనే స్థితిని తెలుసుకోవడానికి, మీరు భారత ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ https://epds.telangana.gov.in/FoodSecurityAct/ ను సందర్శించాలని అధికారులు సూచించారు. ఈ వెబ్సైట్లో మీ దరఖాస్తు స్థితిని.. కార్డు వివరాలను తనిఖీ చేసుకోవచ్చు. లేదా సమీప రేషన్ షాపులో కూడా ఆధార్ నంబర్తో మీకు కార్డు మంజూరైందా లేదా అనే వివరాలను తెలుసుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa