ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.1,150 కోట్లతో 24 అంతస్తుల్లో.. భారీ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 21, 2025, 05:32 PM

ఒకప్పుడు గవర్నమెంట్ హస్పిటల్ అంటే.. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్నట్లుండేవి పరిస్థితులు. అయతే ప్రభుత్వాల చొరవ వల్ల ఈ పరిస్థితి మారుతోంది. నేడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందుతున్నాయి. కొన్ని చోట్ల అధికారులు, వైద్యుల కృషి వల్ల ప్రైవేటు ఆస్పత్రిలో కన్నా మంచి సేవలు, సదుపాయాలు కలిగి ఉంటున్నాయి. ఈ క్రమంలో సామాన్యులకు మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్యుల కోసం ఏకంగా 24 అంతస్తుల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఆ వివరాలలు..


తెలంగాణ ప్రభుత్వం సామాన్యులకు మెరుగైన వైద్యం అందించడం కోసం.. 24 అంతస్తుల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. వరంగల్‌ సెంట్రల్‌ జైలు స్థలంలో నిర్మిస్తున్న ఈ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిని వచ్చే సంవత్సరం అనగా 2026, డిసెంబర్ నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. వచ్చే డిసెంబరు నెలాఖరులోపు ఈ ఆస్పత్రిలో వైద్య సేవలు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం వరంగల్ కలెక్టర్ ఎంజీఎం ఆసుపత్రిలోని వివిధ వైద్య విభాగాధిపతులతో సమావేశం నిర్వహించారు. అనేక అంశాలపై చర్చించారు.


కొత్తగా నిర్మిస్తున్న మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలోని 24 అంతస్తులను.. వైద్య విభాగాల వారీగా కేటాయించారు. వేర్వేరు అంతస్తుల్లో.. వేర్వేరు వైద్య విభాగాలకు అవసరమైన ఏర్పాట్లు చేయడానికి ఏమేం కావాలో నివేదిక తయారు చేసి.. జులై నెలాఖరులోగా అందించాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశించారు.


అంతస్తుల వారిగా కేటాయింపులు ఇలా..


ముందుగా గ్రౌండ్‌ ఫ్లోర్‌ కింద బేస్‌మెంట్‌ ప్రాంతంలో మెడికల్‌ ఆంకాలజీ అనగా క్యాన్సర్‌ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ తర్వాత గ్రౌండ్‌ ఫ్లోర్‌లో అత్యవసర విభాగం, వృద్ధుల ఓపీ సేవలు, ఐసీయూ, ఫార్మసీ, సీటీ స్కాన్, న్యూబర్న్, లేబర్, మెడికల్‌ ఐసీయూ, ఆర్‌ఐసీయూ, ట్రామా ఐసీయూ, ఎంఆర్‌ఐ, అల్ట్రాసౌండ్, మామోగ్రఫీ, జనరల్‌ సర్జరీ, కలర్‌ డాప్లార్,ఆర్థోపెడిక్ విభాగాలు రానున్నాయి.


1వ అంతస్తులో: ఈఎన్‌టీ, రుమటాలజీ, ఓపీ సేవలు, డెర్మటాలజీ, న్యూరోసర్జరీ, జనరల్‌ మెడిసిన్, ఎండోస్కోపి, జనరల్‌ సర్జరీ, ఎక్స్‌రే, డీఎస్‌ఏ, డెమో రూంలకు కేటాయించారు.


2వ అంతస్తులో: పిల్లల ఈఎస్‌ఆర్‌ అత్యవసర విభాగం, ఐసీయూ వార్డులు, నియోనాటల్‌ కేర్‌ యూనిట్‌కు కేటాయించారు.


3వ: ఐవీఎఫ్‌(సంతాన సాఫల్య కేంద్రం) వార్డు, ఆర్‌ఐసీయూ, ఆపరేషన్‌ థియేటర్లు (సుమారు 10 వరకు).


4వ: ఈఎన్‌టీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, ట్రాన్స్‌ప్లాంట్ ఐసీయూ, ఆపరేషన్‌ థియేటర్లు


5వ: డెంటల్‌ వార్డులు, బోన్‌ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌(బీఎంటీ) యూనిట్, జనరల్‌ సర్జికల్‌ డెమో, జనరల్‌ మెడిసిన్‌కు కేటాయించారు.


6వ: ఆర్థోపెడిక్, ఎమర్జెన్సీ వార్డు


7వ: ఎలక్ట్రికల్, ప్లంబింగ్‌ సేవలు


8వ: ఒబెసిటీ, గైనాకలజీ, ఈఎన్‌టీ, పీడియాట్రిక్‌ వార్డు,


9వ: మెడికల్ ఆంకాలజీ, శ్వాసకోశ వ్యాధులు, సర్జికల్‌ వార్డు


10వ: ప్లాస్టిక్ సర్జరీ, డెర్మటాలజీ


11వ: ఎండో క్రైనాలజీ, వృద్ధులు, రోగనిరోధక వ్యవస్థను కోల్పోయిన వారికి, మానసిక, డ్రగ్స్ అలవాటు బారినపడిన వారి చికిత్స వార్డులు.


12వ: సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, మానసిక రోగులు, మెడికల్ వార్డు ఏర్పాటు చేయనున్నారు.


13, 14వ అంతస్తుల్లో: సెమీ, వీఐపీ ప్రైవేటు గదులు


15వ: బ్లడ్‌బ్యాంకు ఏర్పాటు చేయనున్నారు.


మిగిలిన 9 అంతస్తుల్లో ఆయా వైద్య విభాగాల ఫ్యాకల్టీకి కేటాయించేలా ప్రణాళిలకు రూపొందించారు. ఈ నెలాఖరు వరకు.. ఎంజీఎంలోని అన్ని వైద్య విభాగాల ప్రొఫెసర్లుఅందించే నివేదిక ఆధారంగా మార్పులుచేర్పులు చేయిస్తామని ఈ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నోడల్‌ అధికారి తెలిపారు. ఈ ఆస్పత్రి అందుబాటులోకి వస్తే.. బోన్ మ్యారో నుంచి ప్లాస్టిక్ సర్జరీ వరకు అన్ని సేవలు ఒకే చోట.. అది కూడా ఉచితంగా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.


వరంగల్ సెంట్రల్ జైలు స్థలంలో రూ.1,150 కోట్ల వ్యయంతో నిర్మాణం మొదలుపెట్టిన ఈ ఆస్పత్రి నిర్మాణం దాదాపు పూర్తియింది. దీనిలో 2 వేల పడకలు అందుబాటులోకి రానున్నాయి. 2021 జూన్ 21న అప్పటి సీఎం కేసీఆర్ ఈ భవనానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది డిసెంబర్ చివరి నాటికి ఇది ప్రజలకు వైద్య సేవలు అందించనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa