హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతూ.. విశ్వ నగరంగా నిలిచే దిశగా అడుగులు ముందుకు వేస్తుంది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే.. హైదరాబాద్ నగరం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. తాజాగా రేవంత్ సర్కార్ కూడా భాగ్యనగరం అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి అనేక కార్యక్రమాలు రూపొందిస్తుంది. అలానే నగరంలో ప్రధాన సమస్య అయిన ట్రాఫిక్ ప్రాబ్లంను పరిష్కరించడం కోసం నగరం మొత్తం ఫ్లైఓవర్లు, రహదారుల విస్తరణ చేపడుతున్నారు. దీంతోపాటు పట్టణీకరణ వల్ల పెరుగుతున్న కాలుష్య సమస్య నివారణకు రేవంత్ సర్కార్ నడుం బిగిస్తోంది. ఇందుకోసం నగరంలోని పలు ప్రాంతాల్లో రూ. 82.23 కోట్లతో ఖర్చుతో ఎస్టీపీల నిర్మాణానికి రెడీ అవుతోంది. ఆ వివరాలు..
హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ.. నగరంలో కాలుష్యానికి కారణమవుతోంది. ఇది ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలకు ముప్పుగా మారింది. ఈ ముప్పును తప్పించేందుకు వాటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 82.23 కోట్లతో.. నగరంలోని పలు ప్రాంతాల్లో 4 ఎస్టీపీల నిర్మాణానికి పూనుకుంది. ఇక ఆ ప్రాంతాలు ఏవంటే.. శంకర్పల్లి, శంషాబాద్, గండిపేట, హిమాయత్ సాగర్. ఈ ప్రాంతాల్లో మురుగునీరు జంట జలాశయాల్లోకి చేరకుండా చూడటం కోసం వాటిని శుద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
హిమాయత్ సాగర్, శంకర్పల్లి, శంషాబాద్, గండిపేట వంటి ప్రాంతాల్లో నిర్మాణాలు పెరుగుతున్నాయి. ఫామ్హౌస్లు, విల్లాలు, ఇళ్లు, ఇండస్ట్రీలు, విద్యాసంస్థలు, హోటళ్లు వంటివి పెద్ద సంఖ్యలో వెలుస్తున్నాయి. దీని వల్ల మురుగునీరు ఎక్కువగా ఉత్పత్తి అవుతోంది. అలానే మరికొన్ని ప్రాంతాల్లో కాలనీలు, బస్తీలు పెరుగుతున్నాయి. ఈ ప్రాంతాల నుంచి వచ్చే మురుగు జంట జలాశయాల్లో కలిసే అవకాశం ఉంది. దీనిని నివారించడానికి హైదరాబాద్ జలమండలి నడుం బిగించింది. మురుగు కలవకుండా చూడటానికి ఆయా ప్రాంతాల్లో ఎస్టీపీలు నిర్మించాలని నిర్ణయించింది. ఎస్టీపీ అంటే మురుగునీటి శుద్ధి కర్మాగారం. ఇక్కడ మురుగునీటిని శుద్ధి చేసి, తిరిగి ఉపయోగించేందుకు వీలుగా మారుస్తారు.
రూ. 82.23 కోట్లతో కొత్వాల్ గూడ వద్ద 6 ఎంఎల్డీ, నాగిరెడ్డిగూడ వద్ద 5 ఎంఎల్డీ, హిమాయత్ నగర్ దగ్గర 5 ఎంఎల్డీ, జన్వాడ వద్ద 4 ఎంఎల్డీల సామర్థ్యంతో ఎస్టీపీలను నిర్మించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఎండీ అశోక్ రెడ్డి మాట్లాడుతూ, కొత్వాల్ గూడ వద్ద నిర్మాణంలో ఉన్న ఎస్టీపీ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా, 2050 వరకు ఉత్పన్నమయ్యే మురుగును అంచనా వేసి, దానిని శుద్ధి చేయడానికి అవసరమయ్యే ఎస్టీపీల నిర్మాణం గురించి అధ్యయనం చేయాలని చెప్పారు.
మన్నెగూడ వద్ద నిర్మిస్తున్న మరో ఎస్టీపీ పనులను కూడా ఆయన పరిశీలించారు. ఈ ఎస్టీపీలను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్రేటర్ పరిధిలో, ఔటర్ రింగ్ రోడ్డు లోపల 100 శాతం మురుగునీటి శుద్ధి లక్ష్యంగా పెట్టుకున్నారు. మెట్రో వాటర్బోర్డు అధికారులు 31 కొత్త ఎస్టీపీల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. అమృత్-2.0 పథకంలో భాగంగా మరో 39 ఎస్టీపీలను నిర్మించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa