ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫ్రిజ్‌లో పెట్టిన మటన్ కూర తిని.. ఆర్టీసీ ఉద్యోగి మృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 22, 2025, 08:18 PM

హైదరాబాద్ నగరంలో బోనాల పండుగ ఎంత ఘనంగా నిర్వహిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక్కడ బోనాల వేడుకల్లో పాల్గొనడం కోసం ఎక్కడెక్కడో ఉన్న బంధు మిత్రులు తరలి వస్తుంటారు. అలానే ఓ ఆర్టీసీ ఉద్యోగి కూడా ఎంతో సంతోషంగా బోనాల పండుగ చేసుకున్నారు. బంధుమిత్రులను పిలిచి వారికి విందు ఇచ్చారు. భోజనంలో చికెన్, మటన్ వడ్డించారు. పండుగ అయిపోయింది. బంధువులు కూడా వెళ్లిపోయారు. అయితే పండుగ నాడు చేసిన మటన్ కాస్త మిగిలింది. దాన్ని ఫ్రిజ్‌లో పెట్టి మరుసటి రోజు తిన్నారు. ఇంకేముంది.. అలా మటన్ తిన్న వారంతా అస్వస్థతకు గురి కాగా.. సదరు ఆర్టిసీ ఉద్యోగి చనిపోయారు. ఈ విషాదకర సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.


ఈ సంఘటన హైదరాబాద్, వనస్థలిపురంలో వెలుగు చూసింది. శ్రీనివాస్ అనే ఆర్టీసీ ఉద్యోగి ఒకరు ఫుడ్ పాయిజన్ కారణంగా మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చికిత్స పొందుతున్న వారి వివరాలు ఇలా ఉన్నాయి.. రజిత(38), జశ్విత(15), గౌరమ్మ(65), లహరి(17), సంతోష్ కుమార్(39), రాధిక(38), బేబీ కృతంగా (7).. వీరంతా బోనాల పండగ నాడు.. వండి, ఫ్రిజ్‌లో పెట్టిన మటన్, బోటి, చికెన్ తినడం వల్ల అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది.


ఈ ఘటనలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా ఏడుగురు కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. తీవ్ర అస్వస్థతకు గురైన వారిని చింతలకుంటలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించి.. చికిత్స పొందుతున్నారు. అయితే వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీరు మటన్ తిన్న రోజే అస్వస్థతకు గురయ్యారా.. లేక మరుసటి రోజు ఇలా ఆస్పత్రి పాలయ్యారా.. ఫుడ్ పాయిజన్‌కు గల కారణాలు ఏంటి అని విచారించే పనిలో ఉన్నారు. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా దీనిపై స్పందిస్తేనే అసలేం జరిగింది అనే దానిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.


అయితే ఈ మధ్యకాలంలో తెలంగాణలో ఫుడ్ పాయిజన్ కేసులు తరచుగా వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా గిరిజన, గురుకుల పాఠశాలల్లో తరచుగా ఫుడ్ పాయిజనింగ్ కేసులు తెర మీదకు వస్తోన్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్న సాయికుంట ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన వెలుగు చూసింది. నలుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన మరిచిపోకముందే హైదరాబాద్‌లో ఫుడ్ పాయిజన్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఫుడ్ పాయిజన్ కారణంగా ఆర్టీసీ ఉద్యోగి చనిపోవడం సంచలనంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa