తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల వర్షాలు, పండుగలు, విద్యార్థి ఆందోళనల కారణంగా స్కూళ్లు, కాలేజీలు వరుస సెలవులతో మూతపడుతున్నాయి. గత వారం శనివారం నుంచి సోమవారం వరకు మూడు రోజుల సెలవుల తర్వాత, ఇప్పుడు బుధవారం (జూలై 23)న కూడా విద్యా బంద్ పిలుపుతో పాఠశాలలు, జూనియర్ కళాశాలలు మూసివేయనున్నారు. దీంతో విద్యార్థులకు మరో సెలవు దొరుకుతోంది. అయితే, ఈసారి సెలవు వెనుక కారణం విద్యార్థుల సమస్యలు, ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు చేస్తున్న నిరసన.విద్యార్థి సంఘాలు ఏఐఎస్ఎఫ్ (AISF), ఎస్ఎఫ్ఐ (SFI), పీడీఎస్యూ (PDSU), ఏఐవైఎఫ్ (AIYF) కలసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చాయి. విద్యా రంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్తో విద్యాసంస్థలను మూసివేయనున్నట్లు విద్యార్థి సంఘాలు ప్రకటించాయి.
*ప్రధాన డిమాండ్లు ఏంటి : ప్రైవేట్ కాలేజీలలో ఫీజుల దోపిడీకి చెక్ పెట్టాలి: ఫీజుల పేరుతో తల్లిదండ్రుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. దీనిపై తక్షణమే నియంత్రణ చట్టం తీసుకురావాలి. ఉపాధ్యాయుల కొరతను తీర్చాలి: ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు లేకపోవడంతో విద్యార్థులకు పాఠాలు చెప్పడం కష్టమవుతోంది. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, MEO, DEO పోస్టులు వెంటనే భర్తీ చేయాలి.పెండింగ్లో ఉన్న స్కాలర్ షిప్లను వెంటనే చెల్లించాలని, దూర గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ పెద్ద సమస్య నెలకొందని, వారికి ఉచిత బస్ పాస్ సౌకర్యం అవసరమని, అలాగే చాలా మంది విద్యార్థులు పేద కుటుంబాలవారని, వారి కోసం మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కళాశాలల్లో కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యా సంస్థల బంద్ ను విజయవంతం చేయడంలో తల్లిదండ్రులు, మేధావులు, విద్యావేత్తలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa