ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఒక అద్భుతమైన బహుమతిని ప్రకటించారు. తన పుట్టినరోజు సందర్భంగా చేపట్టిన ‘మోడీ గిఫ్ట్’ కార్యక్రమం ద్వారా.. తాను ఎంపీగా కొనసాగినంత కాలం ప్రతి ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదివే విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లను అందిస్తానని ప్రకటించారు. హుస్నాబాద్ పట్టణంలోని మార్కెట్ యార్డులో జరిగిన నాలుగో విడత సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాలకు చెందిన 680 మంది విద్యార్థులకు సైకిళ్లను అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా బాలికలు కేంద్రమంత్రికి కృతజ్ఞతగా ముందస్తుగా రాఖీలు కట్టి, రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో తనను గెలిపించిన ప్రజలకు విద్య, వైద్య పరంగా ఏదో ఒక మంచి పని చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన సూచన తనకు స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. ఆ స్ఫూర్తితోనే ఈ సైకిళ్లను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
బండి సంజయ్ విద్యార్థుల కోసం మరిన్ని ప్రణాళికలను ప్రకటించారు. అతి త్వరలో నర్సరీ నుండి ఆరవ తరగతి చదివే విద్యార్థులందరికీ బ్యాగులు, స్టీల్ వాటర్ బాటిళ్లు, నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్లతో కూడిన ‘మోడీ కిట్స్’ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. అలాగే.. ప్రతి ఏరియాలో వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని.. విద్యార్థులకు తాను మొట్టమొదటగా ఇచ్చే ఆస్తి సైకిల్ అని పేర్కొన్నారు. చదువు కోసం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పడ్డ కష్టాలు, అవమానాలు, ఆయన ఎదిగిన క్రమాన్ని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. నవోదయ స్కూల్ను హుస్నాబాద్కు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని కూడా తెలిపారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, అదనపు కలెక్టర్ గురిమా అగర్వాల్, డీఈవో శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో రామ్మూర్తి, ఎమ్మార్వో లక్ష్మారెడ్డి, హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం, హుస్నాబాద్కు 5వ సారి స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు లభించడం, సిద్దిపేట జిల్లాలోనే స్వచ్ఛ మున్సిపాలిటీగా ఎంపిక కావడం పట్ల మున్సిపల్ సిబ్బందిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. జులై 24వ తేదీన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కూడా విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేసిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa