ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆర్ఐ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 01, 2025, 09:30 PM

తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దూకుడు పెంచింది. తాజాగా.. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని ఆర్ఐ (రెవెన్యూ ఇన్‌స్పెక్టర్) బాలసుబ్రమణ్యం ఒక వ్యక్తి నుంచి రూ. 4,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. కళ్యాణలక్ష్మి పథకానికి సంబంధించిన పని కోసం లంచం అడిగినట్లు బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది. భూత్పూర్ రెవెన్యూ కార్యాలయంలో వివిధ పనుల కోసం వచ్చే వారి నుంచి పెద్ద ఎత్తున లంచాలు వసూలు చేస్తున్నారని గతంలోనూ ఆరోపణలు ఉన్నాయి.


ఈ కళ్యాణలక్ష్మి కేసులో, ఒక గ్రామస్థుడు పక్కా ఆధారాలతో ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. దీంతో వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఏసీబీ అధికారులు, మండల ఆసుపత్రి సమీపంలో బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఆర్ఐ బాలసుబ్రమణ్యంను వల పన్ని పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది ఈ ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం తహసీల్దార్ కార్యాలయంలో బాలసుబ్రమణ్యంపై విచారణ కొనసాగుతోంది.


తెలంగాణలో ఏసీబీ అధికారులు అవినీతిపరుల ఆట కట్టించడానికి మరింత అగ్రెసివ్‌గా వ్యవహరిస్తున్నారు. లంచాల పేరిట ప్రజలను వేధిస్తున్న అధికారులను పట్టుకునేందుకు పకడ్బందీ ప్రణాళికలు రచిస్తున్నారు. అక్రమాలు ఎక్కువగా జరుగుతున్న ప్రభుత్వ కార్యాలయాలపై ఆకస్మిక దాడులు చేపడుతున్నారు. జులై నెలలో మొత్తం 22 కేసులు నమోదయ్యాయి. వీటిలో 13 ట్రాప్ కేసులు, ఒక అసమాన ఆస్తుల కేసు, ఒక క్రిమినల్ దుష్ప్రవర్తన కేసు, ఒక రెగ్యులర్ ఎంక్వైరీ, ఆరు ఆకస్మిక తనిఖీలు ఉన్నాయి. జులైలో ఏసీబీ మొత్తం 20 మందిని అరెస్టు చేసింది. ఇందులో 17 మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఇద్దరు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, ఒక ప్రైవేట్ వ్యక్తి ఉన్నారు. వీరిని కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించారు. ట్రాప్ కేసుల్లో రూ. 5.75 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అక్రమాస్తుల కేసులో రూ. 11.5 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు.


కామారెడ్డి జిల్లా పొందుర్తి ఆర్టీఏ చెక్‌పోస్టు, సదాశివపేట, బీబీనగర్, జడ్చర్ల సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఆకస్మిక దాడులు నిర్వహించి, లెక్కల్లో చూపని రూ. 1,49,880 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు ఏసీబీ మొత్తం 148 కేసులను నమోదు చేసింది. పది మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు/ప్రైవేట్ వ్యక్తులతో సహా 145 మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టు చేసింది. ట్రాప్ కేసుల్లో రూ. 30.32 లక్షల నగదు స్వాధీనం చేసుకోగా, అక్రమాస్తుల కేసుల్లో రూ. 39 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు.


అవినీతి నిర్మూలన..


ఏసీబీ అధికారులు అవినీతి నిర్మూలన కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ మేరకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని పోస్టర్లు, స్టిక్కర్లు అతికిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవినీతిపై అవగాహన కల్పించడానికి చర్యలు చేపట్టారు.


ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు లేదా వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందించాలని కోరుతున్నారు. ఫిర్యాదు చేస్తే తమ పనులు ఆగిపోతాయేమోనని ప్రజలు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అయితే ఎలాంటి భయం అవసరం లేదని.. సదరు పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa