ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మెల్సీ కవితకు ఎమ్మెల్యే జగదీష్‌ రెడ్డి కౌంటర్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 03, 2025, 07:43 PM

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్‌ఎస్ పార్టీలో అంతర్గత విబేధాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ పరిణామాలు గులాబీ పార్టీ భవిష్యత్తుపై అనేక ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి. ఈ వివాదం కవిత చేసిన సంచలన ఆరోపణలతో మొదలైంది.


ఆమె ఏమన్నారంటే.. ‘లిల్లీపుట్ నాయకుడు నల్గొండ జిల్లాలో పార్టీని నాశనం చేశాడు. కన్ను లొట్టపోయి గెలిచిన నాయకుడు.. ఎన్నడూ ప్రజా పోరాటాల్లో పాల్గొనలేదు. అసలు బీఆర్‌ఎస్‌తో మీకేం సంబంధం?’ అంటూ జగదీష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘లిల్లీపుట్ నాయకుడు, నిన్న మొన్న వచ్చిన చోటా మోటా నాయకులు కూడా నాపై మాట్లాడుతున్నారు. బీఆర్‌ఎస్‌కు సంబంధం లేని వ్యక్తితో నాపై ఆరోపణలు చేయిస్తున్నారు. వారి వెనక బీఆర్‌ఎస్‌లో పెద్ద నాయకుడు ఉన్నారు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు అన్ని బయటపెడతాను. పార్టీ కూడా సమయం వచ్చినప్పుడు స్పందిస్తుంది’ అని ఆమె పేర్కొన్నారు. అంతేకాదు.. ‘ఒక ఆడ బిడ్డగా నాపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ సమాజం మొత్తం స్పందించింది కానీ.. బీఆర్‌ఎస్‌ పార్టీ స్పందించలేదు. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నా’ అంటూ పార్టీ అధిష్టానంపై కూడా పరోక్ష విమర్శలు గుప్పించారు.


  దీనిపై స్పందించిన జగదీష్ రెడ్డి.. కవిత వ్యాఖ్యలకు అదే రీతిలో కౌంటర్ ఇచ్చారు. ‘నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితమ్మకు ఉన్న జ్ఞానానికి నా జోహార్లు. కేసీఆర్ శత్రువులైన రేవంత్, రాధాకృష్ణలు నా గురించి మాట్లాడిన మాటల్ని మరొక్కసారి వల్లె వేసేందుకు ఆమె చేసిన ప్రయత్నానికి నా సానుభూతిని తెలియజేస్తున్నాను’ అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇటీవల ఒక టీవీ ఛానెల్‌లో మాట్లాడుతూ.. కవిత గురించి తాము సీరియస్‌గా తీసుకోవడం లేదని.. ఆమె పార్టీలో ఉంటే ఒక ఎమ్మెల్సీ మాత్రమేనని జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపైనే కవిత ఈ స్థాయిలో విరుచుకుపడ్డారు.


కవిత, జగదీష్ రెడ్డి మధ్య జరుగుతున్న ఈ మాటల యుద్ధం బీఆర్‌ఎస్ పార్టీలో పెద్ద కుదుపుకు దారితీసే అవకాశం ఉంది. ఇప్పటికే అధిష్టానం తీరుపై తీవ్ర అసహనంతో ఉన్న కవిత సొంత ఎజెండాతో ముందుకు వెళ్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇలాంటి బహిరంగ విమర్శలు పార్టీలోని వర్గ విభేదాలను మరింత పెంచే అవకాశాలు లేకపోలేదు. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన సమయంలో.. సొంత పార్టీ నాయకుల మధ్యే ఇలాంటి మాటల తూటాలు పేలడం బీఆర్‌ఎస్ ప్రతిష్టకు నష్టం కలిగించవచ్చు. ప్రజల్లో పార్టీపై విశ్వాసం సన్నగిల్లే అవకాశం కూడా ఉంది.


ఇలా పార్టీ నాయకుల మధ్య స్పష్టత లేకపోవడం కార్యకర్తలను గందరగోళంలో పడేస్తుంది. సోషల్ మీడియాలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు రెండుగా చీలిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో గులాబీ బాస్ కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తిగా మారింది. ఈ వివాదాలను అదుపు చేయకపోతే పార్టీ మరింత బలహీనపడే అవకాశం ఉంది. మొత్తంగా.. బీఆర్‌ఎస్‌లో జరుగుతున్న ఈ అంతర్గత పోరు పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. నాయకుల మధ్య సమన్వయం లేకపోతే.. అధికార పక్షాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం కష్టమవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa