గత వారం రోజుల నుంచి హైదరాబాద్ నగరాన్ని కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో నగర వ్యాప్తంగా కూడా రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయి.. నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆఫీసులకు వెళ్లే వారు.. వచ్చే వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వర్షం వచ్చిన ప్రతిసారి నగరంలో సాధారణ జీవనం స్తంభించిపోతోంది. తాజాగా ఈ ట్రాఫిక్ నుంచి బయటపడేందుకు తెలంగాణ మంత్రి తన కాన్వాయ్ను పక్కనపెట్టి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు.
మంత్రికి తప్పని మెట్రో ప్రయాణం..
ఈ ఆదివారం.. మంత్రి జూపల్లి కృష్ణారావు , ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకూకట్పల్లిలో ఒక వివాహ వేడుకకు హాజరు కావాల్సి ఉండగా.. భారీ ట్రాఫిక్ను తప్పించుకోవడానికి వారు తమ కాన్వాయ్ను వదిలిపెట్టి.. ఎల్బీనగర్ నుంచి కేపీహెచ్బీ వరకు మెట్రోలో ప్రయాణించారు. దీనివల్ల వారు సమయానికి గమ్యస్థానానికి చేరుకోగలిగారు. అంతేకాకుండా.. ఈ ప్రయాణ సమయంలో తోటి ప్రయాణికులతో మాట్లాడి ప్రభుత్వ పథకాల గురించి.. ప్రజల అభిప్రాయాల గురించి తెలుసుకున్నారు.
మంత్రి మెట్రోలో వెళ్లడం వల్ల ట్రాఫిక్ సమస్య నుంచి బయటపడగలిగినా.. సామాన్య ప్రజల కష్టాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. వర్షం కారణంగా నగరంలో పలు ప్రధాన కూడళ్లలో, ముఖ్యంగా బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, కూకట్పల్లి, ఎల్బీనగర్ వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ తీవ్రంగా ఇబ్బందులు పెడుతోంది. రోడ్లపై నీరు నిలవడం వల్ల బైక్ మీద ప్రయాణించే వారికి ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయి.
ఆటోలు, బస్సులు కూడా గంటల తరబడి ట్రాఫిక్లో నిలిచిపోవడంతో ఉద్యోగులు, విద్యార్థులు సమయానికి కార్యాలయాలకు, విద్యా సంస్థలకు చేరుకోలేకపోతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ అధికారులను డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త ప్రాజెక్టులు, ఫ్లైఓవర్లు ఈ సమస్యను కొంత వరకు పరిష్కరించే అవకాశం ఉన్నా.. వర్షాకాలంలో ప్రజలకు ఎదురవుతున్న ఈ ఇబ్బందులు నగర మౌలిక సదుపాయాల లోపాలను స్పష్టంగా తెలియజేస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa