ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేటీఆర్ ఆరోపణలకు డిప్యూటీ సీఎం భట్టి ఘాటు స్పందన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 27, 2025, 09:39 PM

తెలంగాణను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్న వేళ, అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ప్రభుత్వ సహాయక చర్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన విమర్శలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అదే స్థాయిలో ఘాటుగా బదులిచ్చారు.రాష్ట్రంలో ప్రజలు వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, బీహార్ లో యాత్రలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో స్వయంగా రంగంలోకి దిగి పర్యవేక్షించేవారని ఆయన గుర్తుచేశారు.కేటీఆర్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. ఎలాంటి సమాచారం లేకుండా ప్రతిపక్ష నేతలు ఎలా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉందని, ముఖ్యమంత్రి, మంత్రులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ను ఉద్దేశించి భట్టి ఘాటు వ్యాఖ్యలు చేశారు. "మీలాగా మా ముఖ్యమంత్రి ఫాంహౌస్‌లో నిద్రపోవడం లేదు" అంటూ చురకలంటించారు.తాము విపత్తు సమయంలో చేతులు కట్టుకుని కూర్చోలేదని, జిల్లా మంత్రులు, అధికారులు క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని ఆయన వివరించారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలు నీట మునిగాయి. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో రికార్డు స్థాయిలో ఒకే రాత్రి 49 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవ్వడంతో రోడ్లు, రైల్వే ట్రాక్‌లు కొట్టుకుపోయాయి. చెరువులకు గండ్లు పడటంతో పొలాలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa