తెలంగాణలో పంట సాగు చేసే రైతులకు యూరియా ఎరువుల కొరత పెద్ద సమస్యగా మారింది. పంటల పెరుగుదల, దిగుబడుల పెరుగుదలకు అవసరమైన ప్రధాన ఎరువుగా యూరియా ఉపయోగిస్తారు. అయితే సరఫరాలో అంతరాయం కలిగిన ప్రతిసారీ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల వరుస వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన సందర్భంలో రైతులు మరింత ఇబ్బందులు పడుతున్నారు. పంటలు రక్షించుకోవాలంటే సమయానికి యూరియా అందుబాటులో ఉండాలి.
కానీ గిడ్డంగుల్లో సరఫరా తక్కువగా ఉండటంతో ఈ సారి రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇలా.. యూరియా అందుబాటులో లేక పంటల సాగులో సమస్యలు ఎదుర్కొంటున్న రైతులకు ప్రభుత్వం సకాలంలో సహాయం అందించేందుకు ముందుకొచ్చింది. ఇప్పటికే రాష్ట్రానికి 9 వేల టన్నుల యూరియా చేరగా.. రాత్రి 5 వేల టన్నుల సరఫరా జరగనుంది. అదేవిధంగా వచ్చే వారం రోజుల్లో మొత్తం 27,470 టన్నుల యూరియా రాబోతుందని వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు.
వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సరఫరా ప్రక్రియను పర్యవేక్షిస్తూ.. ఎరువుల పంపిణీని సక్రమంగా నిర్వహించాలని జిల్లా స్థాయి అధికారులకు సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా వరదల కారణంగా నష్టపోయిన రైతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు. వరదల వల్ల పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో 5 రోజుల్లోగా పూర్తి స్థాయి సర్వే చేసి.. నష్టపోయిన రైతులకు సహాయ చర్యలు చేపట్టేలా సంబంధిత శాఖలను ఆదేశించారు. నష్టపోయిన రైతులకు ఎకరాలకు రూ.10 వేల చొప్పున ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో ఇలానే పంట నష్టపోయిన రైతులకు రూ.10 వేల చొప్పున ఇవ్వగా.. సర్వే తర్వాత అర్హత గల రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ కానున్నాయి. పంట నష్టపోయిన రైతులు ఎలాంటి దిగులు చెందొద్దని త్వరలోనే ఈ సాయాన్ని అందిస్తామని అధికారులు పేర్కొన్నారు.
ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పలు జిల్లాల్లో పంటలు ముంపుకు గురై రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో యూరియా సరఫరా పెరగడం రైతులకు ఊరట కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. సరఫరా అయిన యూరియాను ప్రభుత్వ గిడ్డంగుల ద్వారా సకాలంలో అందుబాటులోకి తేవాలని.. ఎక్కడా నిల్వలు లేకుండా చూడాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
యూరియా సరఫరా సక్రమంగా జరిగితే రాబోయే సాగులో పెద్ద సమస్యలు రాకుండా ఉంటాయి. రైతులు పంటల పెరుగుదలకు అవసరమైన ఎరువులను పొందగలిగితే.. దిగుబడులు కూడా పెరిగే అవకాశం ఉంది. రైతుల సమస్యలను ప్రభుత్వం సమయానికి గుర్తించి చర్యలు తీసుకోవడం పట్ల రైతు సంఘాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఎలాంటి ఆలస్యం లేకుండా రైతులకు ఎరువులను సరఫరా చేయాలని కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa