ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వేలంలో అత్యధిక ధర పలికిన మైహోమ్ భుజా లడ్డూ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 04, 2025, 07:28 PM

వినాయక చవితి వేడుకల్లో గణపతి విగ్రహాలతో పాటు లడ్డూ వేలంపాటలు కూడా భక్తుల దృష్టిని ఆకర్షించే ముఖ్యాంశం. తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ గణపతి విగ్రహం , బాలాపూర్ గణేశ్ లడ్డూ ప్రత్యేక గుర్తింపు పొందాయి. అయితే గత కొన్నేళ్లుగా బాలాపూర్ మాత్రమే కాకుండా నగరంలోని ఇతర ప్రాంతాల్లోనూ లడ్డూ వేలం పాటలు విశేష చర్చకు దారితీస్తున్నాయి. వాటిలో రాయదుర్గం లడ్డూ వేలంపాట ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.


రాయదుర్గంలోని మైహోమ్ భుజా వద్ద ఈ సంవత్సరం జరిగిన గణేశ్ లడ్డూ వేలం రికార్డులు బద్దలు కొట్టింది. ఇల్లందుకు చెందిన కొండపల్లి గణేశ్ అనే భక్తుడు ఏకంగా రూ. 51,77,777 చెల్లించి లడ్డూను సొంతం చేసుకున్నారు. ఈ ధర ఇప్పటి వరకు రాయదుర్గంలోనే కాకుండా నగరవ్యాప్తంగా లడ్డూ వేలంపాటల్లో చరిత్ర సృష్టించింది. గత ఏడాది ఇదే లడ్డూ రూ. 29 లక్షలకు అదే గణేశ్ కొనుగోలు చేయడం విశేషం. అంతకుముందు 2023లో ఈ లడ్డూ రూ. 25.50 లక్షలకు చిరంజీవి గౌడ్ సొంతం చేసుకున్నారు. 2022లో రూ. 20.50 లక్షలకు వ్యాపారవేత్త సత్తిబాబు గెలుచుకున్నారు.


బాలాపూర్ లడ్డూ అనగానే దశాబ్దాలుగా రికార్డు ధరలు పలికిన సంప్రదాయం గుర్తుకు వస్తుంది. గత ఏడాది బాలాపూర్ లడ్డూ రూ. 25 లక్షలకు వెళ్లింది. కానీ ఈసారి రాయదుర్గం లడ్డూ ఆ మొత్తాన్ని మించి, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భక్తులు లడ్డూను సొంతం చేసుకోవడానికి కోట్లలోనైనా వెనుకాడకపోవడానికి కారణం.. అది ఇంటికి శుభం, సంపద, ఆరోగ్యం తీసుకువస్తుందని నమ్మకం. అంతేకాక.. ఈ లడ్డూ గెలుచుకున్నవారికి సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుందనేది మరొక కారణం.


ఈ లడ్డూ వేలంపాటల ద్వారా వచ్చిన నిధులు వినాయక ఉత్సవాల నిర్వహణతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించడం ఒక మంచి సంప్రదాయంగా కొనసాగుతోంది. విద్య, వైద్యం, అవసరమైన సామాజిక పనులకు ఈ నిధులను వినియోగించడం వలన భక్తి కార్యక్రమాలకే కాదు సమాజానికి కూడా ప్రయోజనం కలుగుతోంది. ఇక భవిష్యత్తులో బాలాపూర్, రాయదుర్గం మాత్రమే కాకుండా మరిన్ని ప్రాంతాల్లో లడ్డూ వేలం పాటలు రికార్డు స్థాయిలో జరుగుతాయని అంచనా.


గతంలో హైదరాబాద్‌లోని బండ్లగూడ జాగీర్ కీర్తి రిచ్‌మంచ్ విల్లాస్ వద్ద నిర్వహించిన వినాయక ఉత్సవాల్లో.. గణపతి లడ్డూ ఏకంగా రూ. 1.86 కోట్లు పలికింది. ఈ ధరతో గణేశుడి లడ్డూ వేలం పాటల్లో కొత్త బెంచ్‌మార్క్‌ ఏర్పడి, ఇప్పటి వరకు ఎవరూ అందుకోలేని గరిష్ట స్థాయిని చేరుకుంది. ఈ రికార్డు మొత్తం తెలుగు రాష్ట్రాల గణేశ్ ఉత్సవాల చరిత్రలోనే కాదు, దేశవ్యాప్తంగా లడ్డూ వేలం పాటల్లోనూ అత్యంత ప్రాధాన్యత సాధించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa