బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కోల్ ఇండియాలో పని చేస్తున్న రెగ్యులర్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు భారీ ప్రయోజనాలు కల్పిస్తూ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం కీలక ప్రకటన చేశారు. ఇందులో భాగంగా రెగ్యులర్ ఉద్యోగులకు కోటి రూపాయల అదనపు బీమా కవరేజీతో పాటు, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారిగా కార్మికులు, అధికారులందరికీ ఒకేరకమైన డ్రెస్ కోడ్ ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు.రాంచీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు, విశ్వకర్మ పూజను పురస్కరించుకుని ఈ సెప్టెంబర్ 17వ తేదీ నుంచి ఈ కొత్త పథకాలు అమల్లోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు. కొత్త నిబంధనల ప్రకారం, కోల్ ఇండియాలోని రెగ్యులర్ ఉద్యోగులకు కోటి రూపాయల అదనపు బీమా లభిస్తుందని, కాంట్రాక్ట్ కార్మికులకు రూ. 40 లక్షల వరకు బీమా వర్తిస్తుందని వివరించారు. దీంతో పాటు, రెగ్యులర్ ఉద్యోగులకు ఇచ్చే ఎక్స్గ్రేషియా మొత్తాన్ని రూ. 15 లక్షల నుంచి రూ. 25 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.ఉద్యోగులకు గౌరవప్రదమైన గుర్తింపు ఇవ్వాలనే లక్ష్యంతో దేశంలోని అన్ని బొగ్గు గనుల్లో ఒకేరకమైన డ్రెస్ కోడ్ తీసుకువస్తున్నామని కిషన్ రెడ్డి అన్నారు. ఈ యూనిఫామ్లను కోల్ ఇండియా సంస్థే అందిస్తుందని, ఇది అధికారులకు కూడా వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు.మోదీ ప్రభుత్వ హయాంలో బొగ్గు రంగం గణనీయమైన అభివృద్ధి సాధించిందని మంత్రి తెలిపారు. దేశంలో బొగ్గు ఉత్పత్తి మొదటిసారిగా ఒక బిలియన్ టన్నులు దాటిందని, దిగుమతులు తగ్గించుకోవడం ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో రూ. 60,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేశామని చెప్పారు. ప్రభుత్వం కేవలం బొగ్గుపైనే కాకుండా, కీలక ఖనిజాల అన్వేషణపై కూడా దృష్టి సారించిందని, ఇందుకోసం రూ. 32,000 కోట్లతో 'నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్' ప్రారంభించినట్లు ఆయన గుర్తుచేశారు. దేశంలో 74 శాతం విద్యుత్ థర్మల్ పవర్ నుంచే ఉత్పత్తి అవుతున్నందున, ఇంధన భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa