ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మధు యాష్కీ గౌడ్‌కు అస్వస్థత.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 16, 2025, 06:31 PM

మంగళవారం సాయంత్రం సచివాలయంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్‌ మంత్రి శ్రీధర్ బాబును కలవడానికి సచివాలయానికి వెళ్లారు. సమావేశం కొనసాగుతున్న సమయంలో ఆయన ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఛాతి నొప్పితో కూలిపోయిన ఆయనను చూసి మంత్రి వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశారు. సచివాలయంలోని డిస్పెన్సరీ వైద్యులు ఫస్ట్ ఎయిడ్ చికిత్స అందించారు. ఆ తర్వాత హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు.


వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటన వెలుగులోకి రాగానే కాంగ్రెస్ నాయకులు, అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మధు యాష్కీ ఆరోగ్యం కుదుటపడాలని ఆకాంక్షిస్తూ పార్టీ శ్రేణులు ప్రార్థనలు చేస్తున్నారు.


తెలంగాణ రాజకీయాల్లో మధు యాష్కీ గౌడ్‌కి ప్రత్యేక స్థానం ఉంది. పార్లమెంట్‌లోనూ, రాష్ట్రంలోనూ ఆయన ధైర్యంగా తన అభిప్రాయాలను వ్యక్తపరచడం ద్వారా గుర్తింపు పొందారు. అలాంటి నేత ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడంతో అనుచరుల్లో ఆందోళన నెలకొంది. ఆయన త్వరగా కోలుకుని మళ్లీ రాజకీయ రంగంలో చురుకుగా పాల్గొనాలని అందరూ కోరుకుంటున్నారు.


తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన నాయకుడు మధు యాష్కీ గౌడ్. 1960 డిసెంబర్ 15న హైదరాబాద్‌లో జన్మించిన ఆయన న్యాయశాస్త్రంలో ఉన్నత విద్య పూర్తిచేసి అమెరికాలో లా ప్రాక్టీస్ చేశారు. అక్కడ విజయవంతమైన కెరీర్ కొనసాగిస్తున్నప్పటికీ.. స్వదేశంలో రైతుల ఆత్మహత్యలు, సామాజిక సమస్యలు ఆయనను కదిలించాయి. ఈ కారణంగా భారత్ తిరిగి వచ్చి 2003లో “మధు యాష్కి ఫౌండేషన్” ప్రారంభించి విద్య, ఆరోగ్య రంగాల్లో సహాయం అందించారు.


2004లో కాంగ్రెస్ తరఫున నిజామాబాద్ నుండి లోక్‌సభకు ఎన్నికై.. 2009లో మరోసారి విజయాన్ని సాధించారు. పార్లమెంటులో ధైర్యంగా మాట్లాడే నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. 2014లో ఓటమి తర్వాత కూడా కాంగ్రెస్‌లో చురుకుగా కొనసాగుతూ.. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, స్థానిక సమస్యలపై తన గొంతు వినిపించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసిన ఆయన.. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా వ్యవహరిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa