ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేవంత్ రెడ్డి ఓట్లని అమ్ముకున్నాడు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 16, 2025, 08:13 PM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఓట్లను ఆయన బీజేపీకి అమ్ముకున్నారని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ విషయంలో రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారని వ్యాఖ్యానించారు.ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తమ అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 315 ఓట్లు పడ్డాయని ట్వీట్ చేశారని, కానీ వాస్తవానికి ఆయనకు 300 ఓట్లు మాత్రమే వచ్చాయని కౌశిక్ రెడ్డి గుర్తుచేశారు. గల్లంతైన ఆ 15 ఓట్లలో 8 ఓట్లు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలవేనని ఆయన ఆరోపించారు. ఈ ఎనిమిది మంది ఎంపీలు ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేసి, ఆ తర్వాత కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీలను కలిశారని తెలిపారు. తనకు ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు స్వయంగా ఈ విషయం చెప్పారని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోదీ, చంద్రబాబులతో ఉన్న సంబంధాల కారణంగానే రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలకు ద్రోహం చేస్తున్నారని కౌశిక్ రెడ్డి ధ్వజమెత్తారు. "రాహుల్ గాంధీ దేశంలో ఓట్ల చోరీ గురించి మాట్లాడుతుంటే, ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రే ఓట్లను దొంగిలిస్తున్నారు. రాహుల్ గాంధీ చెప్పారని అభ్యర్థిని నిలబెట్టి, మోదీ చెప్పారని ఓట్లను అమ్ముకున్నారు" అని ఆయన విమర్శించారు. గురుదక్షిణ పేరుతో రేవంత్ రెడ్డి.. మోదీ, చంద్రబాబులకు మేలు చేస్తున్నారని, సొంత పార్టీ బలపరిచిన జస్టిస్ సుదర్శన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచారని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa