హైదరాబాద్లో భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సిటీ శివారు ప్రాంతాల్లోనే లక్షలు పలుకుతుంది. ఇక నగరంలో అయితే కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఐటీ కారిడార్, ఇండస్ట్రీయల్ ఏరియాల్లో ఎకరం భూమి దగ్గర దగ్గర వంద కోట్ల రూపాయలు పలుకుతోంది. నగరంలో భూములు, ప్లాట్లు వేలం వేస్తే ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మరో సారి భూముల వేలానికి రెడీ అవుతోంది. కనిష్టంగా రెండు వేల కోట్ల రూపాయలు ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
దీని కోసం హైదరాబాద్లో అత్యంత ఖరీదైన రాయదుర్గం ప్రాంతంలో భూములను వేలం వేయడానికి ప్రభుత్వం సిద్ధమయ్యింది. దీనిలో భాగంగా నాలెడ్జ్ సిటీలోని 18.67 ఎకరాల భూమిని ఈ వేలం వేయడానికి టీజీఐఐసీ(తెలంగాణ ఇండస్ట్రీయల్ ఇన్ఫ్రాస్ట్రక్షర్) అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక్కడ ఎకరం భూమికి ప్రారంభ ధర రూ.101 కోట్లుగా నిర్ణయించింది. అయితే పలు నిర్మాణ సంస్థలు ఎకరాకు ఏకంగా 140 కోట్ల రూపాయలకు పైగానే చెల్లించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. కోకాపేట మించి ఇక్కడ భూములు ధర పలుకుతాయని రియల్టీ నిపుణులు అంటున్నారు.
భూములు వేలం వేయాలని నిర్ణయించుకున్న టీజీఐఐసీ సర్వే నం.83/1 ప్లాట్ నంబర్ 19లోని 11 ఎకరాలతో పాటుగా ఇదే సర్వే నంబర్లో ప్లాట్ నం.15 ఏ/2లోని 7.67 ఎకరాలను వేలం వేయాలని నిర్ణయించుకుంది. అయితే ఈ భూములు ఎయిర్పోర్ట్ జోన్ పరిధిలోకి వస్తాయి. ఏఏఐ మూడు సంవత్సరాల క్రితం అనగా 2022లో నిబంధనలను సవరించింది. దీని ప్రకారం ఈ ప్రాంతంలో అపరిమిత భవన నిర్మాణ ఎత్తు (ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్–ఎఫ్ఎస్ఐ)కు పర్మిషన్ లేదు. అయితే ఎఫ్ఎస్ఐపై ఆంక్షలున్నప్పటికీ భారీ ధర పెట్టేందుకు బిడ్డర్లు వెనుకాడటం లేదు.. నాలెడ్జ్ సిటీ సుమారు 470 ఎకరాలలో విస్తరించి ఉండగా.. ఇక్కడ 100కు పైగా ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలు ఉన్నాయి. .
వచ్చే నెల అనగా అక్టోబర్ 6న ఈ భూములకు ఈ వేలం నిర్వహించనున్నారు. అయితే ఈ వేలం పాటలో మన దేశానికి చెందిన కంపెనీలు మాత్రమే కాక విదేశీ నిర్మాణ సంస్థలు కూడా పోటీ పడుతున్నాయి. వచ్చే నెల వేలం పాట ఉండటంతో.. ఇప్పటికే 34 మంది బిడ్డర్లు.. నాన్ రీఫండబుల్ డాక్యుమెంట్ ఫీజు కింద.. ఒక్కో ప్లాట్కు రూ.10 లక్షల చొప్పున చెల్లించినట్లు టీజీఐఐసీ తెలిసింది. పలు నిర్మాణ కంపెనీలు ఇక్కడ ఎకరం భూమికి రూ.140 కోట్లకు పైగా బిడ్డింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ మల్టీ నేషనల్ కంపెనీలు, ఐటీఈఎస్, ఐటీ కంపెనీలు, మల్టీ లెవల్ బిల్డింగ్లు, వినోద కేంద్రాలు ఉన్నాయి. దీంతో రాయదుర్గంలో స్థలాలకు డిమాండ్ అధికంగా ఉంది.
పైగా రాయదుర్గం నుంచి ఓఆర్ఆర్, ఎయిర్పోర్ట్, మెట్రో వంటి వాటితో సులువైన కనెక్టివిటీ ఉంది. ఇక్కడినుంచి మెట్రో స్టేషన్కు 5 నిమిషాలు, ఔటర్ జంక్షన్కు 6 నిమిషాలు పడుతుంది. హైటెక్స్కు 15 నిమిషాలు, ఎయిర్పోర్ట్కు 40 నిమిషాలు పడుతుంది. దీంతో ఇక్కడి భూములకు డిమాండ్ అధికంగా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa