ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెంకట్రామిరెడ్డి ఐఏఎస్ పదవికి రాజీనామా చేశారా లేదా.. వివరాలు కోరిన హైకోర్టు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 20, 2025, 06:45 PM

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన వెంకట్రామిరెడ్డి ఎన్నిక చెల్లదంటూ.. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా విచారణ జరిగింది. ఈక్రమంలో హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. వెంకట్రామిరెడ్డి తన అఖిల భారత సర్వీస్‌కు రాజీనామా చేశారా, లేదంటే ఆయన పదవీ విరమణ చేశారా అనే వివరాలు తెలియకుండా పిటిషన్ దాఖలు చేయడం ఏంటని హైకోర్టు.. పిటిషనర్‌ని ప్రశ్నించింది. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి పూర్తి వివరాలు తెలుసుకుని 3 వారాల్లో అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.


2021 నవంబర్‌లో జరిగిన మండలి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా వెంకట్రామిరెడ్డి ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఎన్నిక చెల్లదంటూ జగిత్యాల జిల్లాకు చెందిన జె.శంకర్‌తో పాటు మరొకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2007 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి 2021, నవంబర్ 15 వరకు అధికారిగా పనిచేశారు. అదే సమయంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరాలని భావించి స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. ఐఏఎస్ అధికారుల స్వచ్ఛంద పదవీ విరమణ నియమాల ప్రకారం, నోటీసు ఇచ్చిన మూడు నెలల్లో డీఓపీటీ నుంచి ఆమోదం తప్పనిసరి. అయితే వెంకట్రామిరెడ్డి తన పదవీకి రాజీనామా చేయలేదని.. అలానే ఆయన పదవీ విరమణ పత్రాలు కూడా తమకు అందలేదని అధికారులు తెలిపారు.


  ఈ పిటిషన్‌‌‌‌ను శుక్రవారం నాడు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్‌‌‌‌ల డివిజన్ బెంచ్ విచారించింది. ఈక్రమంలో పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ.. వెంకట్రామిరెడ్డి.. 2021 నవంబర్ 15వరకు కూడా మెదక్ కలెక్టర్‌‌‌‌గా ఉన్నారు. అయితే ఎమ్మెల్సీ పదవికీ పోటీ చేయడం కోసం ఆయన నవంబర్ 15న తన పదవికి రాజీనామా చేశారు. అదే రోజున అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆయన రాజీనామాను అంగీకరించింది. మరుసటి రోజున అనగా నవంబర్ 16న ఆయన ఎమ్మెల్సీ నామినేషన్ సమర్పించారని తెలిపారు.


వెంకట్రామిరెడ్డి రాజీనామాను కేవలం రాష్ట్ర సర్కారు మాత్రమే ఆమోదించిందని.. కేంద్రం ఆమోదించకుండానే ఆయన ఎమ్మెల్సీ అయ్యారని కోర్టుకు తెలిపారు. అలానే కేంద్రం వద్ద వెంకట్రామిరెడ్డి రాజీనామా పత్రం లేదని తెలిపారు. అందువల్ల ఆయన ఎమ్మెల్సీగా కొనసాగడం నిబంధనలకు విరుద్ధమని ప్రకటించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు.


ఈసీ తరపు సీనియర్ న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. వెంకట్రామిరెడ్డి ఐఏఎస్ పదవికి రాజీనామా చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందని తెలిపారు. దీని ఆధారంగానే వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీ నామినేషన్ పేపర్లను ఆమోదించామని తెలిపారు. అయితే సర్వీస్ రూల్స్ ప్రకారం ఆయన రాజీనామాను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉందని అంగీకరించారు. ఇరు వైపుల వాదనలు విన్న కోర్టు అదనపు అఫిడవిట్ వేయాలని సూచిస్తూ.. వాయిదా వేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa