ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.13 వేల కోట్ల భూకజ్జాలో నేతలు, అధికారులకు వాటా.. హైడ్రా కమిషనర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 21, 2025, 04:33 PM

హైదరాబాద్ నగరంలోని గాజుల రామారంలో ప్రభుత్వ భూముల్లో అక్రమ కూల్చివేతలను హైడ్రా కూల్చేవేస్తోంది. దేవేంద్రనగర్, బాలయ్యనగర్, హబీబ్‌నగర్‌లోని మూడు నాలుగేళ్లలోనే వేల కోట్ల విలువైన వందల ఎకరాల భూమిని కేటుగాళ్లు కబ్జా చేసినట్టు హైడ్రా గుర్తించింది. తాజాగా, ఈ కూల్చివేతలపై హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ భూకబ్జాలో రాజకీయ నాయకులు, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారని ఆయన తెలిపారు. మొత్తం 40 ఎకరాల్లో పేదల ఆవాసాలు ఉన్నాయని వివరించారు. స్థానిక నాయకులతో అధికారులు కుమ్మక్కై భూమిని ఆక్రమించుకుని.. వాటిని పేదలకు స్థలాలు విక్రయించారని పేర్కొన్నారు. ఆరు నెలల్లో ఐదారు విడతలుగా స్థానికులతో హైడ్రా, రెవెన్యూ అధికారులు మాట్లాడినట్టు వివరించారు. కబ్జాలు, అక్రమ నిర్మాణాలను తొలగించి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుంటున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు.


‘‘పేదలు నివాసాలను హైడ్రా తొలగించడం లేదు... వాణిజ్య షెడ్లు, కాంపౌండ్‌ వాల్స్, గదుల నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తున్నాం.. అక్రమార్కుల నుంచి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని కంచె ఏర్పాటు చేస్తాం.. దాదాపు రూ.13 వేల కోట్ల విలువైన 275 ఎకరాలకుపైగా భూమిని వెనక్కి తీసుకుంటామం’’ అని రంగనాథ్‌ తెలిపారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి.. 60-70 గజాల్లో ఇళ్లను నిర్మించి రూ.10 లక్షల చొప్పున విక్రయించినట్టు ఫిర్యాదు అందడంతో హైడ్రా రంగంలోకి దిగింది. సర్వే నంబర్‌ 397లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది.


ఇదిలా ఉండగా, హైడ్రా కూల్చివేతలపై స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. కష్టార్జితంతో ఇళ్లను కొనుక్కున్నామని, వాటిని విక్రయించిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కూల్చవద్దంటూ చిన్న పిల్లలతో కలిసి జేసీబీలకు అడ్డుగా నిల్చొని నిరసన తెలిపారు. హైడ్రా సిబ్బందితో పాటు జేసీబీలపై బస్తీవాసులు రాళ్లు విసరడంతో అద్దాలు పగలిపోయాయి. మొత్తం అక్కడ 300 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా.. 100 ఎకరాలు ఆక్రమణకు గురైంది. అక్రమ నిర్మాణాలు, షెడ్లు కూల్చివేసిన అనంతరం 300 ఎకరాల భూమికి హైడ్రా కంచె వేయనుంది.


ఐటీ కారిడార్‌కు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాజుల రామారంలోని ప్రభుత్వ భూముల్లో పక్కా నిర్మాణాలు వెలిశాయి. స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్ (ఎస్ఎఫ్‌సీ), తెలంగాణ పారిశ్రామిక మౌలికవసతులు కార్పొరేషన్ (టీజీఐఐసీ), హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ), హౌసింగ్‌బోర్డులకు దశాబ్దాల కింట ప్రభుత్వాలు భూములను కేటాయించాయి. ఆయా విభాగాలు ప్రభుత్వం కేటాయించిన భూముల్లో కార్యకలాపాలు ప్రారంభించలేదు. దీంతో ఈ భూములపై కొందరు అక్రమార్కుల కన్ను పడింది. అధికారులతో కలిసి ప్లాన్ ప్రకా: భూములను కబ్జా చేస్తున్నారు. మూడున్నర సంవత్సరాల్లో ఏకంగా 103 ఎకరాలు కబ్జాకు గురైంది. ఇక్కడ ఎకరం రూ.40 నుంచి రూ.50 కోట్ల వరకు ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa