సూర్యాపేట జిల్లాలోని నూతనకల్, మద్దిరాల మండలాల్లోని సీలింగ్ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్లు అయింది. ధరణి పోర్టల్ వల్ల చిక్కుల్లో పడ్డ రైతులకు భూభారతి చట్టం వల్ల పరిష్కారం లభించింది. సుమారు 3 వేల ఎకరాల భూములు రైతుల చేతికి రానున్నాయి. ఈ రెండు మండలాల్లోని 9 గ్రామాల రైతులు 50 ఏళ్లుగా ఈ భూములను సాగు చేసుకుంటున్నా పట్టాలు రాక ఇబ్బంది పడుతున్నారు. రైతు బంధు, క్రాప్లోన్లకు దూరమయ్యారు. అయితే తాజాగా భూభారతి చట్టంతో ఈ రైతులకు పట్టాలు ఇచ్చేందుకు మార్గం సుగమం అయ్యింది.
ధరణి పోర్టల్ వచ్చాక సూర్యాపేట జిల్లా, నూతనకల్, మద్దిరాల మండలాల్లోని పలు సర్వే నంబర్లలో ఉన్న 1800 ఎకరాల భూములతో పాటుగా మరో 1200 ఎకరాల భూములను సైతం ధరణి పోర్టల్లో సీలింగ్ కింద నమోదు చేశారు. దీంతో రెండు మండలాల్లోని 9 గ్రామాల్లో ఈ భూములు సాగు చేసుకుంటున్న రైతులు.. చాలా సంవత్సరాల నుంచి రైతు బంధు, క్రాప్ లోన్లు అందక ఇబ్బంది పడ్డారు. వీటిల్లో 1,842 ఎకరాల భూమి కేవలం ముగ్గురి పేరు మీదే ఉంది.
నిజాం కాలలో ఎర్రబాడు దొరగా పేరు పొందిన జెన్నారెడ్డి ప్రతాపరెడ్డికి.. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో లక్షన్నర ఎకరాల భూమి ఉండేది. అయితే తెలంగాణ సాయుధ పోరాట సమయంలో జెన్నారెడ్డికి చెందిన వేలాది ఎకరాల భూమిని పేదలకు పంచారు. అలానే 1972లో భూసంస్కరణలు అమల్లోకి రావడంతో.. చట్ట ప్రకారం ఆ కుటుంబం వద్ద ఉండాల్సిన భూములు మాత్రమే ఉన్నాయి. మిగిలిన భూములన్ని రైతులకు పంచారు.
అయితే అప్పటి రెవెన్యూ రికార్డుల్లో.. పట్టాదారు కాలమ్లో ప్రతాపరెడ్డి భార్య, కొడుకుల పేర్లు రాగా.. కాస్తుదారు కాలమ్లో మాత్రం ఆ భూములను సాగు చేసుకుంటున్న రైతుల పేర్లు వచ్చాయి. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ వల్ల ఈ రైతులు సాగు చేసుకుంటున్న భూములు సీలింగ్ కిందకు పోయాయి. కారణం.. ధరణి పోర్టల్లో కాస్తుదారుల పేర్లు తొలగించారు.
కేవలం ఈ భూములకు పట్టాదారులుగా ప్రతాపరెడ్డి కొడుకులు శ్యాంసుందర్రెడ్డి, సుధీర్రెడ్డి, ఆయన భార్య సుభద్రమ్మ పేర్లు వచ్చాయి. ఇక వీరిలో కూడా ఒక్క శ్యాంసుందర్రెడ్డి పేరు మీదనే 1,533 ఎకరాల భూమి నమోదు అయ్యింది. సుధీర్రెడ్డి పేరు మీద 174 ఎకరాలు, సుభద్రమ్మ పేరు మీద135 ఎకరాల భూమి రికార్డుల్లోకి ఎక్కింది.
అయితే గత ప్రభుత్వం తీసుకు వచ్చిన ధరణి పోర్టల్లో ఎంజాయ్మెంట్ కాలం ఎత్తి వేశారు. కేవలం పట్టాదారు కాలం మాత్రమే ఉండటంతో.. ఈ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పాస్ పుస్తకాలు లభించ లేదు. దీంతో వారు అన్ని ప్రభుత్వ పథకాలకు దూరమయ్యారు. తమ సమస్యను పరిష్కరించి పాస్ బుక్కులు ఇవ్వాలంటూ అధికారుల చుట్టూ తిరిగినా లాభం లేకుండా పోయింది.
అయితే వీరి సమస్యకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి ద్వారా పరిష్కారం లభించింది. భూభారతిలో ఎంజాయ్మెంట్ కాలమ్ను పునరుద్ధరించారు. దీంతో ఈ మండలాల రైతులకు పట్టాలు ఇచ్చేందుకు అవకాశం లభించింది. ఈ క్రమంలో ప్రభుత్వ ఆదేశాలతో సోమవారం నుంచి నూతనకల్, మద్దిరాల మండలాల్లో సర్వే చేపట్టనున్నారు. ఇందుకోసం మొత్తం 16 టీంలను ఏర్పాటు చేశారు. ఒక్కో మండలంలో8 టీమ్లు 45 రోజుల పాటు సర్వే చేయనున్నాయి. సర్వే ముగిసిన తర్వాత ఈ మూడు వేల ఎకరాల భూములను రెగ్యులరైజ్ చేసి.. ఆ తర్వాత అర్హులైన రైతులకు డిజిటల్ పాస్ పుస్తకాలు అందజేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa