ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్రం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్న సీఎం రేవంత్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 23, 2025, 06:02 AM

జీఎస్టీ రేట్లు సోమవారం నుంచి అమల్లోకి రావడంతో తెలంగాణ రాష్ట్రానికి సుమారు రూ. 7,000 కోట్ల భారీ నష్టం వాటిల్లుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాలపై ఇలాంటి భారాలు మోపుతూ కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సరైన పద్ధతి కాదని ఆయన విమర్శించారు. ఈ నష్టాన్ని కేంద్రమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.సోమవారం సింగరేణి ఉద్యోగులకు బోనస్ ప్రకటించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఓ ప్రశ్నకు సమాధానంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్త జీఎస్టీ విధానం వల్ల తగ్గే ఆదాయాన్ని పూడ్చేందుకు కేంద్రం ఐదేళ్ల పాటు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF) అందించాలని కోరారు. "జీఎస్టీ శ్లాబుల్లో మార్పుల వల్ల ఆదాయం కోల్పోతున్న రాష్ట్రాలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది" అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసుకున్న ఆదాయం ప్రకారమే ప్రణాళికలు సిద్ధం చేసుకుందని, ఇప్పుడు ఈ నష్టం వల్ల వాటిపై తీవ్ర ప్రభావం పడుతుందని వివరించారు.ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి, తెలంగాణకు నష్టపరిహారం ఇప్పించేలా చొరవ చూపాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క కేంద్రానికి లేఖ రాస్తారని తెలిపారు. గతంలో జీఎస్టీని ప్రవేశపెట్టినప్పుడు 14 శాతం కంటే ఎక్కువ ఆదాయం కోల్పోయిన రాష్ట్రాలకు కేంద్రం VGF ప్రకటించిందని, ఇప్పుడు రెండో దశ సవరణల్లోనూ అదే విధానాన్ని మరో ఐదేళ్లు కొనసాగించాలని ఆయన సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa