ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.200 కోట్లతో స్కైవాక్.. నీటిపై తేలే క్రికెట్ స్టేడియం.. మారనున్న హుస్సేన్‌సాగర్ రూపురేఖలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 24, 2025, 08:40 PM

తెలంగాణ సర్కార్ నిర్ణయంతో హుస్సేన్‌సాగర్‌‌ రూపు రేఖలు మారబోతున్నాయి. దీని చుట్టూ స్కైవాక్‌ సైక్లింగ్‌ ప్రాజెక్టును కొన్నాళ్ల క్రితమే ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు దీనిపై కదలిక వచ్చింది. కోర్‌ అర్బన్‌ బ్యూటిఫికేషన్‌లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి హుస్సేన్‌సాగర్‌ 2.0 అంశాన్ని ప్రస్తావించారు. దీంతో త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని భావిస్తున్నారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు హుస్సేన్‌సాగర్ చుట్టూ స్కైవాక్, సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడమే కాక.. 24 గంటల పాటు తెరిచి ఉంచే రెస్టారెంట్లు, మాల్స్ వంటి వాటిని ఏర్పాటు చేయాలని హెచ్‌ఎండీఏతో పాటు దాని అనుబంధ సంస్థ అయిన హుమ్టా(హైదరాబాద్‌ యూనిఫైడ్‌ మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ) గతంలోనే ప్రణాళికలను సిద్ధం చేసింది.


అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ స్కైవాక్ అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొందించారు. కానీ అప్పట్లో ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందన రాలేదు. తాజాగా సీఎం రేవంత్ దీని గురించి ప్రస్తావించడంతో.. ఈ అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. గతంలో ప్రతిపాదించిన మాదిరే ఈ స్కైవాక్‌ సైకిల్‌ట్రాక్‌ ప్రాజెక్టు నిర్మిస్తే.. మరిన్ని హంగులతో పర్యాటకులను ఆకర్షిస్తుంది అని అధికారులు అభిప్రాయపడుతున్నారు.


ఏంటీ స్కైవాక్ ప్రాజెక్ట్..


హుస్సేన్‌సాగర్‌ అందాలను భూమీ మీద నుంచి కాక.. కాస్త పైనుంచి వీక్షించేందుకు అనుగుణంగా సుమారు 10 కిలోమీటర్ల మార్గంలో 5.5 మీటర్ల వెడల్పుతో స్కైవాక్ నిర్మించబోతున్నారు. దీనిలో 3 మీటర్లు సైకిల్‌ ట్రాక్‌ కోసం కేటాయిస్తారు. ఖైరతాబాద్‌ మెట్రోస్టేషన్‌ నుంచి ఐమాక్స్‌ మీదుగా ఇందిరా పార్కు వరకు స్కైవాక్‌ నిర్మిస్తారు. దీంతో ఈ ప్రాంతం పరిధిలో ఉన్న పర్యాటక ప్రాంతాలను.. ఈ స్కైవాక్ ద్వారా దర్శించవచ్చు.. అలానే ఆయా ప్రాంతాలకు నడక మార్గంలో చేరుకోవచ్చు. దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా ఇలాంటి స్కైవాక్‌ నిర్మించలేదని.. హైదరాబాద్‌లో హుస్సేన్‌సాగర్‌పై ఏర్పాటు చేసేదే తొలి స్కైవాక్‌గా నిలవనుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో నగరానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభిస్తుందని ఆశిస్తున్నారు.


ఈ స్కైవాక్ కేవలం పర్యాటక ప్రాంతంగా మాత్రమే కాక.. సాయంత్రం వాకింగ్‌ చేసేందుకు కూడా దీన్ని వినియోగించుకోవచ్చని చెబుతున్నారు. ఇక హుస్సేన్‌సాగర్‌ చుట్టూ నిర్మించనున్న ఈ స్కైవాక్ ఒక కిలోమీటర్ నిర్మాణం కోసం ప్రభుత్వం 20 కోట్లు ఖర్చు చేయనుంది. మొత్తం 10 కిమీ మార్గానికి గాను రూ.200 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. దీని చుట్టూ ఇరవై నాలుగు గంటలు తెరిచి ఉండేలా షాపింగ్‌ మాల్స్, రెస్టారెంట్లు వంటివి కూడా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీనిలో భాగంగా హుస్సేన్‌సాగర్‌లో నీటిపై తేలే క్రికెట్ స్టేడియం, బాస్కెట్‌బాల్‌ కోర్టు వంటి వాటిని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఈ స్కైవాక్ నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుంది అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa