ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ రైళ్లు సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ఆగవు.. కొత్త రైల్వే స్టాప్‌లు ఇవే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 26, 2025, 07:47 PM

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సాధారణంగానే రద్దీ విపరీతంగా ఉంటుంది. ట్రైన్ స్టేషన్‌లో ఆగిందంటే చాలు.. వేల మంది ప్రయాణికులు ఫ్లాట్‌ఫాంపై కనిపిస్తారు. ఎక్కడ చూసినా ప్రయాణికులే కనపడతారు. అయితే ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అమృత్ స్టేషన్ లో భాగంగా పునరాభివృద్ధి పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతీ ఫ్లాట్ ఫామ్ పై పనులు జరగుతుండటంతో.. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కనీసం కూర్చొవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది.


సాధారణ సమయంలోనే ఇలా ఉంటే.. దసరా, దీపావళి లాంటి పెద్ద పండగల సమయంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందో ఊహించలేం. అడుగు తీసి మరో అడుగు వేయలేని పరిస్థితులు ఉంటాయి. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ రోజుల్లో ప్రయాణికులకు సౌకర్యం కల్పించేందుకు నేటి నుంచి అక్టోబర్‌ 5 వరకు పది రోజుల పాటు కొన్ని రైళ్లకు తాత్కాలిక స్టాప్‌లు ప్రకటించింది.


ప్రయాణికులు సికింద్రాబాద్ ప్రధాన స్టేషన్‌కు రాకుండా సమీపంలోని హైటెక్‌ సిటీ, లింగంపల్లి, చర్లపల్లి వంటి స్టేషన్ల నుంచి కూడా ఎక్కేందుకు వీలుండేలా ఈ సౌకర్యాలు కల్పించారు. ఈ ఏర్పాట్లను ఉపయోగించుకోవడం ద్వారా సికింద్రాబాద్ స్టేషన్‌లో రద్దీ తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. హైటెక్‌ సిటీ స్టేషన్‌లో విశాఖపట్నం–లింగంపల్లి, హడప్సర్–కాజీపేటతో పాటు మొత్తం ఆరు రైళ్లు ఆగుతాయి. హైటెక్‌ సిటీ , చర్లపల్లి స్టేషన్లలో నరసాపూర్–లింగంపల్లి, కాకినాడ టౌన్–లింగంపల్లి సహా మరో నాలుగు రైళ్లు నిలిచేలా నిర్ణయించారు.


చర్లపల్లి స్టేషన్‌లో సికింద్రాబాద్–దానపూర్, దానపూర్–సికింద్రాబాద్ రైళ్లకు తాత్కాలిక స్టాప్‌లు ఇచ్చారు. లింగంపల్లి స్టేషన్‌లో సికింద్రాబాద్–రాజ్‌కోట్, హైదరాబాద్–CST ముంబైతో సహా మొత్తం ఎనిమిది రైళ్లు ఆగనున్నాయి. దసరా సీజన్‌లో సాధారణంగా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి పర్యాటకులు, ఉద్యోగులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ప్రయాణిస్తారు.


ఈ ప్రత్యేక ఏర్పాట్లు రద్దీని నియంత్రించడమే కాకుండా ప్రయాణికుల సమయాన్ని ఆదా చేస్తాయని రైల్వే అధికారులు తెలిపారు. తాత్కాలిక స్టాప్‌లను ఉపయోగించుకుని సమీప స్టేషన్ల నుంచే ఎక్కి దిగడం ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయని సూచించారు. ప్రయాణికులు టికెట్లను ముందుగానే బుక్ చేసుకోవాలని, పండుగ రద్దీ సమయంలో స్టేషన్ నియమాలు పాటించాలంటూ దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa