తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణ కార్యాచరణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి పనుల పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేయనున్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. సుమారు 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో.. రూ.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ అత్యాధునిక కార్యాలయ భవనం నాలుగు నెలల్లో పూర్తి కానుంది. భవిష్యత్తులో ఈ కార్యాలయం నుంచే ఫ్యూచర్ సిటీలో చేపట్టే అభివృద్ధి పనులు, పరిశ్రమలు, లేఅవుట్లకు సంబంధించిన అన్ని రకాల అనుమతులను FCDA అధికారులు మంజూరు చేస్తారు.
ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రణాళికల ప్రకారం.. ఫ్యూచర్ సిటీ దాదాపు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం కానుంది. ఇది 7 మండలాలు, 56 రెవెన్యూ గ్రామాల పరిధిలో విస్తరించనుంది. ఈ ఫ్యూచర్ సిటీని 'నెట్-జీరో స్మార్ట్ సిటీ'గా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్యూచర్ సిటీకి మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు కీలక రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు. ఇందులో భాగంగా శ్రీశైలం, నాగార్జునసాగర్ హైవేలను కలుపుతూ కొత్త ఈస్ట్-వెస్ట్ ట్రంక్ రోడ్డును నిర్మించనున్నారు. అవుటర్ రింగ్ రోడ్డు (ORR), ప్రాంతీయ రింగ్ రోడ్డు లను అనుసంధానం చేస్తూ వంద మీటర్ల వెడల్పుతో గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ల నిర్మాణం కూడా చేపట్టనున్నారు. దీనిలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి రావిర్యాల్-ఆమన్గల్ గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్-1కు భూమి పూజ చేశారు.
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన ఆయన.. తనకు ఫ్యూచర్ సిటీలో భూములు ఉన్నాయని ప్రచారం, ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. నిజంగా తనకు ఇక్కడ ఎకరం భూమి కూడా లేదని..అలా ఉంటే అందరికి తెలుస్తుంది కదా అని వ్యాఖ్యానించారు. అభివృద్ధిని అడ్డుకోవటానికి తనపై కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ' నాకు ఫ్యూచర్ సిటీలో భూములు లేవు. తెలంగాణ అభివృద్ధి కోసమే ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నాం. ఫ్యూచర్ సిటీని బెంగళూరుతో కనెక్ట్ చేస్తాం. అమరావతి నుంచి చెన్నైకు బుల్లెట్ ట్రైన్ రాబోతుంది. ఇక్కడి నుంచి కూడా బుల్లెట్ ట్రైన్లు పరుగులు పెట్టిస్తాం. అమరావతికి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మిస్తాం. ఇక్కడే అనేక కంపెనీలు రాబోతున్నాయి. మరో పదేళ్లు అధికారం ఇవ్వండి.. ఫ్యూచర్ సిటీని, తెలంగాణను ఊహించనంతగా అభివృద్ధి చేస్తాం.' అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యనించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa