దసరా పండుగ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) తమ ఉద్యోగులకు భారీ శుభవార్త అందించింది. పారిశుద్ధ్య కార్మికుడి నుంచి ఉన్నతాధికారి వరకు అందరికీ వర్తించేలా, ఎలాంటి ప్రీమియం భారం లేకుండా రూ.30 లక్షల నుంచి రూ.1.25 కోట్ల వరకు ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)తో జీహెచ్ఎంసీ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవల వినాయక నిమజ్జనం విధుల్లో ఉన్న పారిశుద్ధ్య కార్మికురాలు రేణుక ప్రమాదవశాత్తు మరణించిన ఘటన అందరినీ కలచివేసింది. ఈ నేపథ్యంలో విధి నిర్వహణలో తరచూ ప్రమాదాలకు గురయ్యే కార్మికులు, ఇతర సిబ్బంది కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఈ చొరవ తీసుకున్నారు.సింగరేణి సంస్థ తమ కార్మికులకు అందిస్తున్న బీమా విధానాన్ని ఆదర్శంగా తీసుకుని ఈ పథకాన్ని రూపొందించారు. దీని ప్రకారం రూ.25 వేల లోపు వేతనం పొందే వారికి రూ.30 లక్షలు, రూ.25 వేల నుంచి రూ.75 వేల మధ్య జీతం ఉన్నవారికి రూ.50 లక్షలు ప్రమాద బీమా లభిస్తుంది. అలాగే, రూ.75 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు వేతనం ఉన్నవారికి రూ.కోటి, రూ.1.50 లక్షలకు పైగా జీతం అందుకునే వారికి రూ.1.25 కోట్ల బీమా కవరేజీ వర్తిస్తుందని అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa