ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్యోగులు.. ఆ వివరాలు ఇవ్వకపోతే ఈ నెల జీతం రాదు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 18, 2025, 07:01 PM

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ కీలక అలర్ట్ జారీ చేసింది. ఉద్యోగులు వారి ఆధార్ కార్డ్ నంబర్, సెల్ ఫోన్ నంబర్ కచ్చితంగా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ వివరాలు ఇవ్వని ఉద్యోగులకు ఈ నెల జీతం రాదు అని తెలంగాణ ఆర్థిక శాఖ .. అన్ని ప్రభుత్వ శాఖల అధిపతులను హెచ్చరించింది. ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో పని చేస్తోన్న ఉద్యోగుల వివరాలు ఆఫీసుల్లో లేవా.. వాటిని ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయడం సాధ్యం కాదా అని ప్రశ్నించింది. ఈ వివరాలు ఇవ్వని ఉద్యోగులకు ఈ నెల జీతం రాదని హెచ్చరించింది.


తాజాగా తెలంగాణ ఆర్థిక శాఖ.. అన్ని ప్రభుత్వ విభాగాల అధిపతులకు కీలక అలర్ట్ జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను ఐఎఫ్ఎంఐఎస్‌ పోర్టల్‌లో నమోదు చేయాల్సిందిగా అన్ని విభాగాల అధిపతులను ఆదేశించింది. ఈ నెల 25 లోపు వివరాలు నమోదు చేయకపోతే.. ఆ ఉద్యోగులకు అక్టోబర్ నెల జీతం రాదని హెచ్చరించింది. దీని గురించి సెప్టెంబర్ నెలలోనే ఆదేశాలు జారీ చేసినా.. పలు శాఖల అధికారులు ఇంకా వివరాలు నమోదు చేయలేదని తెలిపింది. దీంతో ఈ నెల 25 వరకు గడువు ఇచ్చింది. ఆలోపు వివరాలు నమోదు చేయకపోతే.. అలాంటి వారికి ఈ నెల అనగా అక్టోబర్ జీతం రాదని ఆర్థిక శాఖ హెచ్చరించింది.


ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో.. శాశ్వత, టెంపరరీ ఉద్యోగులు అందరూ కలిపి మొత్తం 10.14 లక్షల మంది ఉన్నారు. వీరందరి పేర్లు, హోదా, ఆధార్, ఫోన్‌ నంబర్లు తదితర వివరాలన్నింటిని ప్రతి నెల 10 వరకు ఆర్థికశాఖ నిర్వహణ పోర్టల్‌(ఐఎఫ్‌ఎంఐఎస్‌)లో నమోదు చేయాలని గత నెలలోనే ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఈ నెల 16 వరకు సగం మంది ఉద్యోగులు కూడా వారి వివరాలు నమోదు చేయలేదు.


ఈ క్రమంలో వివరాలివ్వని ఉద్యోగుల జీతాల బిల్లులు అక్టోబర్ నెలలో ఆమోదించేది లేదని ఆర్థికశాఖ హెచ్చరించింది. రాష్ట్రంలో మొత్తం 5.21 లక్షల మంది శాశ్వత ఉద్యోగులుండగా.. వారిలో కేవలం 2.22 లక్షల మంది మాత్రమే వారి నమోదు చేశారు. అలానే రాష్ట్రంలో మొత్తం 4.93 లక్షల మంది తాత్కాలిక ఉద్యోగులు ఉండగా.. వారిలో కేవలం 2.74 లక్షల మంది వివరాలే నమోదయ్యాయి. ఉదాహరణకు విద్యుత్‌శాఖలో 95,394 మంది ఉద్యోగులు ఉంటే.. వారిలో కేవలం కేవలం 53 మంది, ఎస్సీ సంక్షేమశాఖలో 14,267 మంది ఉద్యోగులు ఉండగా వారిలో కేవలం 2,223 మంది.. అలానే పోలీసుశాఖలో 1,04,189 సిబ్బంది ఉండగా.. వారిలో కేవలం 48,383 మంది వివరాలనే అప్‌లోడ్‌ చేశారు. ఏ ఒక్క శాఖలో కూడా వంద శాతం ఉద్యోగుల వివరాలు నమోదు చేయలేదని తెలిపారు. కనుక అక్టోబర్ 25లోగా అందరూ వివరాలు నమోదు చేయాలని.. చేయని ఉద్యోగుల జీతాలు కట్ చేస్తామని ఆర్థిక శాఖ హెచ్చరించింది.


ఉద్యోగులకు సంబంధించిన పూర్తి వివరాలు లేకపోవడంతో కొన్నిచోట్ల అక్రమాలు జరుగుతున్నాయని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందతున్నాయి. కొన్ని శాఖల్లో తాత్కాలిక ఉద్యోగలు మానేసినా.. సుదీర్ఘ కాలం సెలవులో వెళ్లినా.. వారి పేరు మీద జీతాలు డ్రా చేస్తూనే ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు గాను ప్రభుత్వం ఉద్యోగుల ఆధార్, మొబైల నంబర్ వంటి వివరాలు అడుగుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa