తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ప్రాధాన్యతను పెంచేందుకు విమాన సదుపాయం అత్యవసరంగా మారింది. పారిశ్రామిక, ఆధ్యాత్మిక కేంద్రంగా కీలకమైన ఈ ప్రాంతంలో విమానాశ్రయం నిర్మించడానికి కొన్నేళ్లుగా జరుగుతున్న ప్రయత్నాలు సాంకేతిక అడ్డంకుల వల్ల ఆగిపోయాయి. గతంలో ప్రతిపాదించిన స్థలంలో సమస్యలు ఎదురవడంతో.. కొత్త స్థలం కోసం అన్వేషణ జరుగుతోంది.
కొత్త స్థలం కోసం ప్రయత్నాలు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త స్థలాలను పరిశీలించింది. గత భారాస ప్రభుత్వ నిర్ణయాన్ని పక్కన పెట్టి.. సుజాతనగర్ మండలంలోని గరీబ్పేట, రామవరం ప్రాంతాల్లో సుమారు 950 ఎకరాలను కాంగ్రెస్ సర్కారు ఎంపిక చేసింది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సర్వే బృందం ఈ ఏడాది జనవరిలో ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించి దానిపై నివేదికను కేంద్రానికి సమర్పించింది.
అయితే.. కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో ఉన్న సాంకేతిక, భూ సంబంధిత సమస్యల కారణంగా ఆ ప్రదేశం విమానయానానికి అనువుగా లేదని ఏఏఐ బృందం స్పష్టం చేయడంతో.. విమానాశ్రయం ప్రారంభ అంశం మళ్లీ మొదటికి వచ్చింది. అధికారులు జిల్లాలో మరెక్కడైనా అనుకూలమైన ప్రదేశం ఉందా అని వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో దుమ్ముగూడెం మండలం తెరపైకి వచ్చింది.
విమానాశ్రయం నిర్మాణానికి దుమ్ముగూడెం మండలంలో అనువైన ప్రదేశం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతానికి ఇక్కడే విమానాశ్రయం ఏర్పాటు చేస్తారని ఖచ్చితంగా చెప్పినప్పటికీ.. సానుకూల సంకేతాలు ఇస్తున్నారు. దీనితో పాటు మరిన్ని స్థలాలను కూడా పరీక్షించనున్నట్లు సమాచారం. దుమ్ముగూడెం ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పడితే.. అది తెలంగాణకు మాత్రమే కాకుండా, సరిహద్దు రాష్ట్రాలకు కూడా పెద్ద ప్రయోజనం చేకూరుస్తుంది. ఆంధ్రప్రదేశ్ , ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న దుమ్ముగూడెం, ఖమ్మం, భద్రాద్రి జిల్లాలతో పాటు ఏపీలోని గోదావరి తీరప్రాంతాలు, ఛత్తీస్గఢ్లోని దక్షిణ ప్రాంతాలకు రవాణా ద్వారంగా పనిచేస్తుంది.
ఇది ఈ ప్రాంతాల మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేస్తుంది. భద్రతా అవసరాల దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కీలకమైన రవాణా కేంద్రంగా ఉపయోగపడుతుంది. వరదలు వంటి విపత్తుల సమయంలో సహాయక చర్యలకు కూడా ఈ కేంద్రం అనువుగా ఉంటుంది. ముఖ్యంగా, దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం రామాలయ సందర్శనకు దేశ, విదేశాల భక్తులు సులభంగా చేరుకోగలుగుతారు. దీనితో పాపికొండలు, కిన్నెరసాని, పర్ణశాల వంటి పర్యాటక ఆకర్షణలు మెరుగైన అభివృద్ధిని సాధిస్తాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa