ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫ్యూచర్‌సిటీ ఏర్పాటు కోసం,,,ప్రభుత్వ, అసైన్డ్‌ భూములతో భారీ భూ బ్యాంక్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 16, 2025, 07:25 PM

రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ఫోర్త్‌సిటీని నిర్మించాలని సంకల్పించింది. దీనికి సంబంధించి వచ్చే నెలలో కందుకూరు మండలంలోని మీరాఖాన్‌పేటలో గ్లోబల్ సమ్మిట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ సమ్మిట్‌కు వచ్చే పారిశ్రామికవేత్తలు సంస్థల ఏర్పాటుకు భూమి అడిగిన వెంటనే కేటాయించేందుకు వీలుగా.. భూమి కొరత లేకుండా ఉండటానికి వీలుగా ఈ భూ బ్యాంకును సిద్ధం చేస్తున్నారు.


తహసీల్దార్లు తమ మండలాల పరిధిలోని ప్రభుత్వ, అసైన్డ్, భూదాన్, సీలింగ్ భూములను రికార్డుల ద్వారా పరిశీలించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ప్రక్రియలో యాచారం, కందుకూరు, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, మంచాల, కడ్తాల్, మాడ్గుల, ఆమనగల్లు, తలకొండపల్లి వంటి కీలక మండలాలను ఎంచుకున్నారు. ఆయా మండలాల్లో 250 ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ భూములను, వాటి సర్వే నంబర్లను అధికారులు గుర్తిస్తున్నారు.


భూమి నాణ్యతను తెలుసుకోవడానికి అధికారులు గూగుల్ మ్యాప్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగిస్తున్నారు. గుర్తించిన భూములు చదునుగా ఉన్నాయా, గుట్టలు, రాళ్లు, రప్పలతో ఉన్నాయా, చెరువులు, కుంటలు ఏమైనా ఉన్నాయా, సాగుకు యోగ్యమైన ప్రాంతం ఎంత అనే వివరాలతో కూడిన సమగ్ర నివేదికను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా యాచారం, మొండిగౌరెల్లి, చింతుల్ల, చింతపట్ల, నల్లవెల్లి వంటి గ్రామాల్లో వందలాది ఎకరాల అసైన్డ్, ప్రభుత్వ భూములు ఉన్నట్లు అధికారులు లెక్క తేల్చారు.


అసైన్డ్ రైతుల్లో ఆందోళన..


ఈ భూ బ్యాంకు తయారీ విషయంలో అధికార యంత్రాంగం చూపిస్తున్న వేగం ఆయా గ్రామాల అసైన్డ్ రైతుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం పేదలకు జీవనోపాధి కోసం పంపిణీ చేసిన అసైన్డ్‌ భూములను ఇప్పుడు పారిశ్రామిక అవసరాల పేరుతో తిరిగి తీసుకుంటే తాము బతికేదెలా అని వారు ప్రశ్నిస్తున్నారు. గతంలో తమ కుటుంబాలు కష్టపడి చదును చేసుకున్న భూములు ఇప్పుడు ఫ్యూచర్‌సిటీ కోసం సేకరించబడతాయేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.


జీవనోపాధికి మూలమైన భూమిని కోల్పోవాల్సి వస్తే తమ భవిష్యత్తు అంధకారంలో పడుతుందని వారు ఆవేదన చెందుతున్నారు. పారిశ్రామిక అభివృద్ధి అవసరమే అయినప్పటికీ.. తరతరాలుగా సాగు చేసుకుంటున్న పేద రైతులకు తగిన నష్టపరిహారం, ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa