ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.10 వేలు కడితే చాలు....2 ఎకరాల 10 గుంటల వ్యవసాయ భూమి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 16, 2025, 07:30 PM

ఇటీవల కాలంలో ఆస్తుల విక్రయాలలో లక్కీ డ్రా ధోరణి ఊపందుకుంటోంది. ఫ్లాట్లు, ప్లాట్లు, చివరికి వ్యవసాయ భూములను కూడా విక్రయించడానికి చాలా మంది యజమానులు ఈ వినూత్న మార్గాన్ని అనుసరిస్తున్నారు. చిన్న పెట్టుబడితో పెద్ద ఆస్తిని సొంతం చేసుకునే అవకాశం ఉండటంతో.. ప్రజల నుంచి ఈ ప్రకటనలకు అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ ట్రెండ్‌ను అనుసరిస్తూ.. తాజాగా కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ రైతు తన భూమిని అమ్మడానికి ఇదే లక్కీ డ్రా పద్ధతిని ప్రకటించారు.


కామారెడ్డి జిల్లా, రాజంపేట మండలం, బస్వాన్నపల్లి గ్రామానికి చెందిన రైతు రాజు సోషల్ మీడియా వేదికగా ఈ సంచలనాత్మక ప్రకటన చేశారు. ఆయన తన 2 ఎకరాల 10 గుంటల వ్యవసాయ భూమిని విక్రయించేందుకు ఈ డ్రాను తెరపైకి తెచ్చారు. ఒక్కో టికెట్‌ను రూ. 10,000 చొప్పున మొత్తం 500 టికెట్లు విక్రయించాలని రైతు నిర్ణయించారు. 500 టికెట్ల అమ్మకం పూర్తయితే రైతుకు మొత్తం రూ. 50 లక్షలు సమకూరుతాయి. స్థానిక రియల్ ఎస్టేట్ నిపుణుల అంచనా ప్రకారం.. ఆ భూమి ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ. 30 లక్షల నుంచి రూ. 35 లక్షలు మాత్రమే. అంటే.. ఈ డ్రా ద్వారా రైతు మార్కెట్ విలువ కంటే దాదాపు రూ. 15 నుంచి రూ. 20 లక్షల వరకు అదనంగా రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.


ఈ తరహా లక్కీ డ్రాలు విజయవంతం కావడం తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటిసారి కాదు. గతంలో ప్లాట్లు, ఇళ్లకు ఇలాంటి డ్రాలు నిర్వహించిన యజమానులు తమ ఆస్తులను మార్కెట్ కంటే ఎక్కువ ధరకు అమ్ముకోగలిగారు. ఉదాహరణకు.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఒక వ్యక్తి తన ఇంటి స్థలాన్ని లక్కీ డ్రా విధానం ద్వారా రూ. 16 లక్షల విలువైన ఇంటిని లక్కీ డ్రా ద్వారా విక్రయించాడు. దీనిని సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ పసిపాప సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.


మరో లక్కీ డ్రాలో సూర్యాపేట జిల్లాలోని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడ తన ప్లాట్ ను విక్రయించేందుకు లక్కీ డ్రా విధానాన్ని అనుసరించాడు. ప్రస్తుతం అతడు కూడా టికెట్స్ ను అమ్మే పనిలో ఉండగా.. డ్రా మాత్రం సంక్రాంతికి తీస్తానన్నాడు. మంచిర్యాల జిల్లాలో ఓ రైతు రూ.10 వేలకే తన 4 ఎకరాల వ్యవసాయ భూమిని లక్కీ డ్రాలో పెట్టేశాడు. ఇలా ఇటీవల కాలంలో ఈ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది. ఇక కామారెడ్డి జిల్లాలోని ఈ రైతు తన డ్రాలో భూమిని గెలుచుకున్న విజేత, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపు డ్యూటీ ఖర్చులను స్వయంగా భరించాల్సి ఉంటుందన్న నిబంధన విధించాడు. చిన్న మొత్తంలో పది వేలు చెల్లించి.. దాదాపు 30 లక్షల విలువైన భూమిని పొందే అద్భుతమైన అవకాశం కావడంతో.. సోషల్ మీడియాలో దీనిపై ఆసక్తి పెరుగుతోంది.


అయితే.. మొత్తం 500 మంది సభ్యులు ఎప్పుడు చేరతారు..? డ్రా పారదర్శకత ఎలా ఉంటుంది..? ఒకవేళ డ్రా రద్దయితే డబ్బు తిరిగి చెల్లించే విధానం ఏమిటి వంటి అంశాలపై మరింత స్పష్టత అవసరమని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ.. రైతు రాజు మాత్రం 2026 సంక్రాంతి లోపు సభ్యుల నమోదు పూర్తి చేసి డ్రా నిర్వహిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చిన్న మొత్తంలో పెట్టుబడితో పెద్ద ఆస్తిని దక్కించుకునే ఈ ప్రయోగం స్థానిక ప్రజలలో చర్చనీయాంశంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa