ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో నవంబర్ 19 నుంచి పత్తి కొనుగోళ్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 18, 2025, 07:38 PM

తెలంగాణ రాష్ట్రంలోని పత్తి రైతులు ఎదుర్కొంటున్న కొనుగోళ్ల సమస్యకు తాత్కాలికంగా తెరపడింది. నవంబర్ 17 నుంచి రాష్ట్రంలోని జిన్నింగ్ మిల్లులు కొనుగోళ్లను నిలిపివేసిన నేపథ్యంలో.. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. ఈ చర్చల ఫలితంగా.. నవంబర్ 19 నుంచి పత్తి కొనుగోళ్లు యథావిధిగా ప్రారంభమవుతాయని మంత్రి ప్రకటించారు.


సీసీఐ(కాటన్ కార్పొరేషన ఆఫ్ ఇండియా), కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ మధ్య నెలకొన్న వివాదం కారణంగా కొనుగోళ్లు నిలిచిపోయాయి. కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ విధానం, అలాగే ఎకరాకు కేవలం ఏడు క్వింటాళ్లను మాత్రమే కొనుగోలు చేయడం, అన్ని కొనుగోలు కేంద్రాలను ఒకేసారి ప్రారంభించకపోవడం వంటి కఠిన నిబంధనలపై మిల్లర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.


మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, సీసీఐ సీఎండీ లలిత్ కుమార్ గుప్తా, జిన్నింగ్ మిల్లర్ల అసోసియేషన్‌తో పలుమార్లు చర్చలు జరిపారు. నవంబర్ 17న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి, తేమ నిబంధనలు సడలించాలని.. ఎకరానికి 7 క్వింటాళ్ల కొనుగోలు షరతును రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ చర్చల తర్వాత.. నవంబర్ 19 నుంచి పత్తి కొనుగోళ్లు కొనసాగుతాయని.. త్వరలోనే అన్ని జిల్లాలలో జిన్నింగ్ మిల్లులు పూర్తిస్థాయిలో ప్రారంభమవుతాయని మంత్రి తుమ్మల గుడ్ న్యూస్ చెప్పారు.


తెలంగాణలో ఈ వానాకాలం సీజన్‌లో పత్తి పంట సాగు విస్తీర్ణం గణనీయంగా ఉంది. రాష్ట్రంలో 45.85 లక్షల ఎకరాల్లో రైతులు పత్తిని సాగు చేశారు. వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం.. సుమారు 27 లక్షల టన్నుల పత్తి దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. ఇప్పటివరకు సీసీఐ కేవలం 67 వేల మంది రైతుల నుంచి 1.18 లక్షల టన్నుల పత్తిని మాత్రమే కొనుగోలు చేసింది. కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.


కొనుగోళ్లను నిలిపివేయడం వెనుక ప్రతిపక్ష నాయకులు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. రైతులు అలాంటి ఉచ్చులో పడొద్దని సూచించారు. జిన్నింగ్ మిల్లర్లకు ప్రభుత్వం తరపున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ నిర్ణయం ద్వారా క్వింటాలుకు కనీస మద్దతు ధర లభించి.. రైతులు నష్టపోకుండా ఉంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa