తెలంగాణ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఇటీవల తమ కార్యకలాపాలను ముమ్మరం చేశారు. అవినీతికి పాల్పడుతున్న అధికారుల భరతం పడుతూ.. సామాన్య ప్రజలకు న్యాయం లభించేలా చూస్తున్నారు. ఈ క్రమంలో.. లంచం తీసుకోవాలంటేనే అధికారులు భయపడే వాతావరణాన్ని తీసుకొస్తున్నారు. ఏసీబీ దూకుడును ప్రజలు, గ్రామస్థులు ప్రశంసిస్తున్నారు.
తాజాగా.. మెదక్ జిల్లాలోని టేక్మాల్ ఎస్సై రాజేష్ ఏసీబీ వలలో చిక్కారు. ఒక కేసు విషయంలో ఎస్సై రాజేష్ లంచంగా రూ. 40 వేలు డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగారు. ఎస్సై రాజేష్ లంచం డబ్బులు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు అకస్మాత్తుగా రంగంలోకి దిగారు. ఏసీబీ అధికారులను చూసి భయపడిన ఎస్సై రాజేష్, వెంటనే పంట పొలాల్లోకి పారిపోయాడు. ఏసీబీ అధికారులు కూడా ఏ మాత్రం వెనుకాడకుండా ఎస్సైను వెంబడించి పట్టుకున్నారు. వెంటనే పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి విచారణ చేపట్టారు.
అవినీతికి పాల్పడుతున్న ఎస్సై ఏసీబీకి చిక్కడంతో.. టేక్మాల్ గ్రామస్థులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ఎదుటే టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఏసీబీ అధికారుల తీరుపై ప్రశంసల వర్షం కురిపించారు. వారి దృష్టిలో.. ఈ అరెస్టు అవినీతికి వ్యతిరేకంగా జరిగిన విజయంగా భావించారు.
తెలంగాణలో ఏసీబీ గత కొన్ని నెలలుగా పెద్ద, చిన్న అనే తేడా లేకుండా.. ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందించి.. పకడ్బందీగా రంగంలోకి దిగుతున్నారు. వాటిలో.. హైదరాబాద్లోని సాగునీటి పారుదల శాఖకు చెందిన ఒక అదనపు కార్యదర్శి స్థాయి అధికారి భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ పట్టుబడటం సంచలనం సృష్టించింది.
ప్రజలతో నిత్యం సంబంధాలు ఉండే రెవెన్యూ శాఖలో ఏసీబీ దూకుడు ఎక్కువగా ఉంది. భూ సమస్యలు పరిష్కరించడానికి, ధృవపత్రాలు ఇవ్వడానికి లంచాలు డిమాండ్ చేస్తున్న తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు ఇటీవల వలల్లో చిక్కారు. ముఖ్యంగా.. వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో వరుస అరెస్టులు జరిగాయి. వ్యవసాయ, వాణిజ్య కనెక్షన్ల విషయంలో లంచాలు అడుగుతున్న విద్యుత్ శాఖ అధికారులను కూడా ఏసీబీ వదలలేదు. ప్రజలకు మరింత పారదర్శకమైన పాలన అందించడానికి ఏసీబీ కృషి చేస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa