ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘ఇన్నాళ్లు ఆగాను.. కచ్చితంగా వచ్చి తీరుతుంది’,,,,మంత్రి పదవిపై కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 19, 2025, 07:34 PM

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లూ ఆ రెండు ఖాళీ మంత్రి పదవుల పైనే ఉన్నాయి. ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. తన పట్ల అదృష్టం తలుపు తడితే త్వరలోనే మంత్రి పదవి వస్తుందని.. అప్పటి వరకు వేచి చూస్తానని ఆయన అనడం వెనుక అధిష్టానం నుండి ఏదైనా గ్రీన్ సిగ్నల్ వచ్చిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుండి ఇప్పటి వరకు రెండు సార్లు మంత్రి వర్గ విస్తరణ జరిగింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం తెలంగాణ అసెంబ్లీ బలాన్ని బట్టి గరిష్టంగా 18 మంది మంత్రులు ఉండవచ్చు. మొదట సీఎంతో పాటు.. 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో మొత్తం సంఖ్య 12 కి చేరింది. తర్వాత సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేస్తూ ముగ్గురు కొత్త మంత్రులను కేబినెట్‌లోకి తీసుకున్నారు. అందులో.. గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరికి మంత్రి పదవులు దక్కాయి.


ఆ తర్వాత మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ ను మంత్రిగా నియమించడంతో మంత్రివర్గ సంఖ్య 16 కి పెరిగింది. ప్రస్తుతం కేబినెట్‌లో ఇంకా రెండు ఖాళీలు ఉన్నాయి. ఈ రెండు స్థానాల కోసం కాంగ్రెస్ పార్టీలో భారీ స్థాయిలో పోటీ నెలకొంది. రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచీ ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఒకే కుటుంబం నుండి ఇద్దరు మంత్రులు ఉండకూడదనే వాదనను రాజగోపాల్ రెడ్డి తిప్పికొడుతున్నారు. క్రికెట్‌లో ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్ ఇద్దరూ దేశం కోసం ఆడలేదా అని ప్రశ్నిస్తూ.. తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిగా ఉన్నా తనకు పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.


పార్టీలో చేరే సమయంలో ఇచ్చిన మాట ప్రకారం తనకు మంత్రి పదవి ఇవ్వాలని ఆయన అధిష్టానాన్ని కోరుతున్నారు. అయితే సామాజిక సమీకరణాలు, జిల్లాల వారీ ప్రాతినిధ్యం దృష్ట్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రెండు స్థానాలను ఎవరితో భర్తీ చేస్తారనేది సస్పెన్స్‌గా మారింది. తెలంగాణ కేబినెట్‌లో ఇంకా మైనార్టీ వర్గానికి సరైన ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్ ఉంది. అలాగే హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి జిల్లాల నుండి మంత్రులు లేరు.


ముదిరాజ్ సామాజిక వర్గం నుండి వాకిటి శ్రీహరిని, మాల మరియు మాదిగ వర్గాల నుండి వివేక్, లక్ష్మణ్‌లను తీసుకోవడం ద్వారా ప్రభుత్వం అట్టడుగు వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చింది. మిగిలిన రెండు స్థానాల్లో ఒకటి రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే.. మరొకటి మైనార్టీ లేదా మహిళా కోటాలో వెళ్లే అవకాశం కనిపిస్తోంది. రాజగోపాల్ రెడ్డి ధీమాను చూస్తుంటే.. తదుపరి విస్తరణలో ఆయనకు చోటు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. కానీ కాంగ్రెస్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టమే మరి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa