ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులకు వరంగా కేంద్ర ప్రభుత్వ పథకం.. ఏడాదికి రూ. 20 లక్షలు సంపాదించే ఛాన్స్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 20, 2025, 09:33 PM

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్నదాతకు అదనపు ఆదాయం కోసం 'పీఎం కుసుమ్'  పథకం తీసుకొచ్చింది. సాగుకు యోగ్యం కాని బంజరు భూములను విద్యుత్ కేంద్రాలుగా మార్చి.. అన్నదాతలకు అదనపు ఆదాయం కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. దీని ద్వారా రైతులు తమ పొలాల్లో సౌర విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటివరకు సుమారు 750 దరఖాస్తులు అందగా.. విద్యుత్ ఉపకేంద్రాలకు 5 కిలోమీటర్ల పరిధిలో భూమి ఉన్నవారికే ఈ అవకాశం లభిస్తోంది. ప్రారంభ పెట్టుబడి కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఇది 25 ఏళ్ల పాటు స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే అద్భుతమైన పథకం.


పీఎం కుసుమ్ పథకం కింద ఒక రైతు కనిష్ఠంగా 0.5 మెగావాట్ల (500 కిలోవాట్ల) నుంచి గరిష్ఠంగా 2 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. అర మెగావాట్ (0.5 MW) ప్లాంట్ ఏర్పాటుకు సుమారు రూ. 1.50 కోట్ల పెట్టుబడి అవసరమవుతుంది. ఇందులో బ్యాంకుల ద్వారా 70 శాతం వరకు రుణ సదుపాయం లభిస్తుంది. 0.5 మెగావాట్ ప్లాంట్ ద్వారా ఏడాదికి సగటున 7.5 లక్షల నుంచి 8 లక్షల యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ప్రభుత్వం నిర్ణయించిన టారిఫ్ యూనిట్‌కు సుమారు రూ. 3.13 ప్రకారం, ఏడాదికి రూ. 22 లక్షల నుంచి రూ. 25 లక్షల ఆదాయం వస్తుంది. బ్యాంక్ లోన్ వాయిదాలు, నిర్వహణ ఖర్చులు పోను రైతుకు నికరంగా ఏడాదికి రూ. 15 నుండి రూ. 20 లక్షల వరకు ఆదాయం మిగిలే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


చాలా చోట్ల రైతులు సాగుకు పనికిరాని భూములను వృథాగా వదిలేస్తున్నారు. అటువంటి భూముల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం వల్ల అటు విద్యుత్ ఉత్పత్తి అవ్వడమే కాకుండా, రైతుకు నెలకు లక్షల్లో ఆదాయం లభిస్తుంది. ఉత్పత్తి చేసిన విద్యుత్తును నేరుగా డిస్కంలే కొనుగోలు చేస్తాయి కాబట్టి మార్కెటింగ్ సమస్య ఉండదు. రైతు వ్యక్తిగతంగా లేదా రైతు సంఘాలు (FPOs) కలిసి ఈ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవచ్చని తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (TGREDCO) జిల్లా మేనేజర్ సంతోష్ పేర్కొన్నారు.


రైతులు తమ సిబిల్ స్కోర్ ఆధారంగా బ్యాంకుల నుంచి సులభంగా రుణాలు పొందేలా ప్రభుత్వం సమన్వయం చేస్తోంది. 2047 నాటికి కర్బన ఉద్గారాలను తగ్గించాలనే లక్ష్యంలో భాగంగా చేపట్టిన ఈ పథకం రైతులకు ఆర్థికంగా పెద్ద ఊరటనివ్వనుంది. విద్యుత్ ఉపకేంద్రాల సమీపంలో భూమి ఉన్న రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa