హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో రాష్ట్ర మంత్రులతో అత్యంత కీలకమైన సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, పరిపాలనా పరమైన అంశాలపై చర్చించేందుకు ఈ భేటీకి అత్యధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాలనలో వేగం పెంచడంతో పాటు, పెండింగ్లో ఉన్న పలు అంశాలపై స్పష్టత ఇచ్చేందుకు ఈ సమావేశం వేదిక కానుంది. మంత్రులందరూ ఈ సమావేశానికి హాజరుకానుండటంతో, ఇందులో ఎలాంటి నిర్ణయాలు వెలువడుతాయనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ఈ సమావేశంలో ప్రధానంగా రానున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల నిర్వహణ, అక్కడ అనుసరించాల్సిన వ్యూహరచనపై మంత్రులతో సీఎం చర్చించనున్నట్లు సమాచారం. ఇటీవలే ముగిసిన పంచాయతీ ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకోవడంతో పాటు, త్వరలో జరగనున్న పరిషత్ ఎన్నికలకు పార్టీని, ప్రభుత్వాన్ని సన్నద్ధం చేయడంపై దిశానిర్దేశం చేయనున్నారు. అంతేకాకుండా, రాష్ట్రంలో అత్యంత కీలకమైన బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై కూడా లోతుగా చర్చించి, న్యాయపరమైన, రాజకీయపరమైన చిక్కులు లేకుండా ముందుకు వెళ్లేలా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
మరోవైపు అభివృద్ధి పనులకు సంబంధించి, ఇటీవల జరిగిన గ్లోబల్ సమ్మిట్లో కుదుర్చుకున్న భారీ పెట్టుబడి ఒప్పందాలు, వాటి అమలు తీరుతెన్నులపై కూడా ఈ భేటీలో సమీక్షించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం, తద్వారా యువతకు ఉపాధి అవకాశాలను పెంచడంపై మంత్రులకు సీఎం ప్రత్యేక సూచనలు చేయనున్నారు. దీనితో పాటు పరిపాలనలో మార్పులు చేర్పుల్లో భాగంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల భారీ బదిలీల ప్రక్రియపైన కూడా చర్చ జరగనుంది. సమర్థవంతమైన అధికారులను కీలక స్థానాల్లో నియమించడం ద్వారా పాలనను మరింత ప్రజలకు చేరువ చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.
చివరగా, ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న వివిధ కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకంపై కూడా ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. పార్టీ కోసం కష్టపడ్డ వారికి తగిన పదవులు కట్టబెట్టే అంశంపై మంత్రుల అభిప్రాయాలను సీఎం స్వీకరించనున్నారు. మొత్తంగా ఈ సమావేశం ద్వారా ప్రభుత్వం రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన విధానాలు, రాజకీయ వ్యూహాలపై ఒక స్పష్టమైన రోడ్మ్యాప్ను రూపొందించుకోనుంది. రేపు తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంపై ప్రభావం చూపనున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa