మెదక్ జిల్లా, మెదక్ మండల పరిధిలోని పెద్దబాయి తండాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన భాస్కర్కు, తిమ్మక్కపల్లి తండాకు చెందిన యువతితో సుమారు ఆరేళ్ల క్రితం పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో వీరికి ఓ మగబిడ్డ జన్మించాడు. ప్రస్తుతం ఆ బాలుడి వయసు మూడేళ్లు కాగా, ఆ చిన్నారితో ఆ దంపతులు జీవనం సాగిస్తున్నారు.
అయితే గత కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఇటీవల భాస్కర్ తన భార్యను విచక్షణారహితంగా కొట్టడంతో, ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. భర్త వేధింపులు తాళలేక, తన మూడేళ్ల కుమారుడిని భాస్కర్ వద్దే వదిలేసి ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో బాలుడు తండ్రి సంరక్షణలోనే ఉంటున్నాడు.
భార్య పుట్టింటికి వెళ్ళాక భాస్కర్ మనసులో అనుమానం పెరిగిపోయింది. తన భార్య ప్రవర్తనపై సందేహంతో పాటు, ఆ మూడేళ్ల బాలుడు తనకు పుట్టలేదనే విపరీతమైన అనుమానాన్ని పెంచుకున్నాడు. ఈ అనుమానం పెనుభూతమై, కన్న ప్రేమని చంపేసింది. క్షణికావేశంలో ఆ చిన్నారిని తాడుతో ఉరివేసి, అతి కిరాతకంగా హత్య చేశాడు. అభం శుభం తెలియని ఆ చిన్నారి ప్రాణాలను సొంత తండ్రే బలిగొన్నాడు.
ఈ ఘోర విషయాన్ని తెలుసుకున్న స్థానికులు మరియు బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడు భాస్కర్పై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa