సొంతిల్లు అనేది ప్రతి పేదవాడి జీవిత కాల స్వప్నం. ఆ కలను నిజం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. గూడు లేని పేదలకు ఆసరాగా నిలిచి.. వారు ఆత్మగౌరవంతో జీవించాలన్నదే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అయితే.. ఈ సాయం నిజమైన అర్హులకు మాత్రమే అందాలని.. ఎక్కడా అవినీతికి తావుండకూడదని ప్రభుత్వం కొన్ని నియమాలను రూపొందించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఈ ఇళ్ల నిర్మాణం వేగంగా సాగుతున్నప్పటికీ.. నిబంధనలు అతిక్రమించిన వారిపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిధుల మంజూరులో పారదర్శకత కోసం అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాహనం ఉంటే అనర్హులే.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక ఎస్టీ లబ్ధిదారుడికి ఇల్లు మంజూరై.. పునాది వరకు పనులు జరిగాయి. కానీ.. సర్వేలో ఆ వ్యక్తికి సొంతంగా ఫోర్ వీలర్ ఉన్నట్లు తేలింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కారు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు కారు. దీంతో అతనికి అందాల్సిన తదుపరి నిధులను అధికారులు నిలిపివేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరో వ్యక్తికి ఇల్లు మంజూరైంది. అయితే.. సదరు లబ్ధిదారుడు గతంలోనే ప్రభుత్వం నుంచి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం పొందినట్లు అధికారుల రికార్డుల్లో తేలింది. ఒకసారి లబ్ధి పొందిన వారికి మళ్లీ అవకాశం ఉండదని స్పష్టం చేస్తూ.. అతని నిధులను కూడా నిలిపివేశారు.
ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను ప్రాథమికంగా కేటాయించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు సుమారు 3.48 లక్షల ఇళ్లకు ఆమోదం తెలిపారు. ఇందులో దాదాపు 2.48 లక్షల ఇళ్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటికే 20 వేల ఇళ్లు పైకప్పు (స్లాబ్) స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటివరకు లబ్ధిదారులకు వివిధ విడతల కింద ప్రభుత్వం 3,800 కోట్ల రూపాయలను నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేసింది. సర్వేలో తేలిన వివరాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2,500 మంది అనర్హులు ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో చేరినట్లు గుర్తించి.. వారి నిధులను నిలిపివేశారు.
లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ ప్రమేయం లేకుండా... గ్రామంలో ఐదుగురు సభ్యులతో కూడిన ఇందిరమ్మ కమిటీలను ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీలు ఎంపిక చేసిన పేర్లను ఎమ్మెల్యేలు, జిల్లా ఇన్ చార్జి మంత్రులు ఆమోదిస్తారు. లబ్ధిదారుల ఫోటోలు తీయడానికి లేదా నిధుల విడుదల కోసం ఏ అధికారి అయినా లంచం అడిగితే వారిని వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే పలువురు ఫీల్డ్ అధికారులపై చర్యలు తీసుకున్నారు.
మధ్యవర్తుల బెడద లేకుండా ఉండటానికి లబ్ధిదారులే స్వయంగా తమ ఇంటి నిర్మాణ ఫోటోలను ఇందిరమ్మ మొబైల్ అప్లికేషన్ ద్వారా అప్ లోడ్ చేసే సదుపాయం కల్పించారు. లబ్ధిదారులు తమ సమస్యలు చెప్పుకోవడానికి లేదా వారి ఖాతాకు డబ్బులు ఎప్పుడు జమ అవుతాయో తెలుసుకోవడానికి హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కాల్ సెంటర్ ను అందుబాటులోకి తెచ్చారు. ఇదిలా ఉండగా.. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి సంబంధించి మంత్రి పొంగులేటి కీలక అప్ డేట్ ఇచ్చారు. ఏప్రిల్ నెలలో ఈ పంపిణీ ఉంటుందని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa