హైదరాబాద్ నగర శివార్లలో భారీ భూ కుంభకోణం బట్టబయలైంది. అబ్దుల్లాపూర్మెట్ మండలం కొహెడ, ఉమర్ ఖాన్ గూడ గ్రామాల్లో ఉన్న సుమారు 282 ఎకరాల భూమిని ఆదాయపు పన్ను శాఖకు చెందిన బినామీ నిషేధిత విభాగం (BPU) తాత్కాలికంగా అటాచ్ చేసింది. ఈ భూముల ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు రూ.2,002 కోట్లు ఉంటుందని అధికారుల అంచనా. ఈ వ్యవహారంలో మొత్తం 17 ప్రొవిజనల్ అటాచ్మెంట్ ఆర్డర్లను జారీ చేశారు.
ఐటీ శాఖ దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం.. ఈ భూములకు సంబంధించి గతంలో సంఘీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ , ఇన్కార్ రియల్టీ ప్రాజెక్ట్స్, వెంకటేశ్వర రియాల్టీ మధ్య జరిగిన లావాదేవీలు బినామీ పద్ధతిలో సాగాయని తేలింది. ఈ మొత్తం వ్యవహారంలో రవి సంఘీ, అతని కుటుంబ సభ్యులు అసలైన యజమానులని ఇన్కార్ రియల్టీ కేవలం ఒక బినామీదారుగా మాత్రమే వ్యవహరించిందని ఐటీ అధికారులు గుర్తించారు.
సంఘీ ఇండస్ట్రీస్ ప్రమోటర్లు కంపెనీకి చెందిన కీలకమైన భూములను ప్రైవేట్ సంస్థలకు తక్కువ ధరకు మళ్లించారని దర్యాప్తులో తేలింది. సెబీ నిబంధనల ప్రకారం.. కంపెనీ ఆస్తుల అమ్మకానికి ఆడిట్ కమిటీ, మైనారిటీ షేర్ హోల్డర్ల అనుమతి తప్పనిసరి. అయితే.. ఈ అనుమతులను తప్పించుకోవడానికి భూమి విలువను ఉద్దేశపూర్వకంగా తక్కువ చేసి చూపించారని అధికారులు తెలిపారు. కంపెనీని మరో పెద్ద సంస్థ స్వాధీనం చేసుకునే ముందు.. అత్యంత విలువైన ఈ భూములను తమ నియంత్రణలో ఉన్న ప్రైవేట్ సంస్థల్లోకి మార్చుకోవడానికి ఒక ముందస్తు పథకం ప్రకారం ఈ కుట్ర సాగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
మొదట 282 ఎకరాల భూమిని ఇన్కార్ రియల్టీకి కేవలం రూ.84 కోట్లకు విక్రయించినట్లు చూపారు. ఇది కంపెనీ మొత్తం టర్నోవర్లో 10 శాతం కంటే తక్కువ ఉండటంతో షేర్ హోల్డర్ల అనుమతి అవసరం లేకుండా పోయింది. ఇన్కార్ రియల్టీ తన సొంత నిధులతో భూమిని కొనలేదు. రవి సంఘీ తన షేర్లను విక్రయించగా వచ్చిన సొమ్ము నుంచి రూ.245 కోట్లను వెంకటేశ్వర రియల్టర్స్లోకి పెట్టుబడిగా మార్చి.. ఆపై ఇన్కార్ రియల్టీకి పంపారు. అదే రోజున ఇన్కార్ రియల్టీ ఆ మొత్తాన్ని సంఘీ ఇండస్ట్రీస్కు చెల్లించింది.
మేనేజ్మెంట్ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత.. భూమి విలువను రూ.84 కోట్ల నుండి రూ.218 కోట్లకు పెంచుతూ రెక్టిఫికేషన్ డీడ్స్ రాశారు. దీని కోసం 2024లో తయారు చేసిన రిపోర్టులకు 2023 నాటి తేదీలను వేసి, ఫోటోలను మార్ఫింగ్ చేసి అధికారులు బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు. సంఘీ ఇండస్ట్రీస్ తాము భూములను సంబంధం లేని మూడవ పార్టీకి అమ్ముతున్నామని సెబీకి తప్పుడు సమాచారం ఇచ్చింది. కానీ వాస్తవానికి ఆ భూములు ప్రమోటర్ల నియంత్రణలో ఉన్న ట్రస్టుల హస్తగతం అయ్యాయి. ఇది మైనారిటీ వాటాదారులను వంచించడమేనని ఐటీ శాఖ ఆరోపిస్తోంది. ప్రస్తుతం ఈ 282 ఎకరాల భూమి ఐటీ శాఖ ఆధీనంలో ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa