స్విట్జర్లాండ్లోని దావోస్లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సులో తెలంగాణ సత్తా చాటేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. జనవరి 19 నుండి 23 వరకు జరిగే ఈ ప్రతిష్టాత్మక సదస్సులో "తెలంగాణ రైజింగ్ 2047" విజన్ డాక్యుమెంట్ను ఆయన ప్రపంచ దిగ్గజాల ముందు ఆవిష్కరించనున్నారు. రాబోయే రెండు దశాబ్దాలలో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రభుత్వం రూపొందించిన సమగ్ర కార్యాచరణను ఈ సందర్భంగా వివరించనున్నారు.
ఈ పర్యటనలో ప్రధానంగా హైదరాబాద్ ‘ఫోర్త్ సిటీ’ (నాల్గవ నగరం) ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఇప్పటికే ఐటీ, ఫార్మా రంగాల్లో గ్లోబల్ హబ్గా ఉన్న హైదరాబాద్కు అనుబంధంగా, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా ఫోర్త్ సిటీని ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, అత్యాధునిక సాంకేతికతతో నిర్మించబోయే ఈ నగరం అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ప్రధాన కేంద్రంగా మారుతుందని ముఖ్యమంత్రి ఈ వేదిక ద్వారా చాటిచెప్పనున్నారు.
ప్రపంచ ఆర్థిక వేదికలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న ‘తెలంగాణ పెవిలియన్’ ఈ సారి పర్యాటకులని, పారిశ్రామికవేత్తలను విశేషంగా ఆకర్షించనుంది. ఇక్కడ ఫోర్త్ సిటీకి సంబంధించిన త్రీడీ (3D) నమూనాను ప్రదర్శించి, ఆ ప్రాజెక్టు గొప్పతనాన్ని కళ్లకు కట్టినట్లు వివరించనున్నారు. దీని ద్వారా అంతర్జాతీయ స్థాయి కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించడమే కాకుండా, రాష్ట్ర పారిశ్రామిక వృద్ధికి కొత్త రూపునిచ్చేందుకు ప్రభుత్వం భారీ కసరత్తు చేస్తోంది.
తెలంగాణ అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వం సిద్ధం చేస్తున్న ఈ సమగ్ర నివేదికలో విద్య, వైద్యం, ఉపాధి మరియు పారిశ్రామిక రంగాలకు పెద్దపీట వేశారు. కేవలం ఐటీ రంగమే కాకుండా సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ వంటి కొత్త విభాగాలలో కూడా రాష్ట్రాన్ని గ్లోబల్ డెస్టినేషన్గా మార్చడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి బృందం పని చేస్తోంది. దావోస్ సదస్సు ముగిసే నాటికి రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు మరియు ఒప్పందాలు వస్తాయని ప్రభుత్వం ఎంతో ధీమాగా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa