తెలంగాణ రాజకీయాల్లో 'హిల్ట్' పాలసీ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. హైదరాబాద్ను కాలుష్య రహిత నగరంగా మార్చే క్రమంలో తీసుకువచ్చిన ఈ విధానంపై అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు హిల్ట్ పాలసీ అంటే ఏంటి..? ఈ పాలసీని తీసుకురావడం వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏంటి..? ప్రతిపక్షాలు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి..? మొదలైన విషయాలను తెలుసుకుందాం.
అసలేంటి 'హిల్ట్' పాలసీ..?
హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీకి సంక్షిప్త రూపమే హిల్ట్ పాలసీ . ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న పరిశ్రమలను నగరం బయటకు తరలించి, సుమారు 9,292 ఎకరాల పారిశ్రామిక భూముల వినియోగాన్ని మార్చుకునే అవకాశం కల్పించడం ఈ పాలసీ ఉద్దేశం. గత 50 ఏళ్లలో హైదరాబాద్ నగరం ఊహించని వేగంగా విస్తరించింది. ఒకప్పుడు నగరం వెలుపల ఉన్న బాలానగర్, సనత్నగర్, ఉప్పల్, జీడిమెట్ల వంటి పారిశ్రామిక వాడలు ఇప్పుడు జనావాసాల మధ్యకు వచ్చేశాయి. ఫ్యాక్టరీల పక్కనే అపార్ట్మెంట్లు, నివాసాలు ఉండటం వల్ల ప్రజలు తీవ్ర కాలుష్యం బారిన పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడం కోసం పరిశ్రమలను రింగ్ రోడ్ అవతలకు తరలించి, అప్పటి వరకూ పరిశ్రమలు నడిపిన భూములను పారిశ్రామిక జోన్ల నుంచి మల్టీ-యూజ్ అంటే రెసిడెన్షియల్, కమర్షియల్ జోన్లుగా మార్చుకునే వెసులుబాటు కల్పించనున్నారు. ఈ పాలసీ కింద ఆయా ఇండస్ట్రియల్ భూములను నివాస ప్రాంతాలుగా మార్చనున్నారు. బదులుగా పరిశ్రమల యజమానులకు ఓఆర్ఆర్ వెలుపల భూములు కేటాయిస్తారు. అయితే ఇలా కన్వర్ట్ చేసే భూములు ప్రభుత్వ భూములు కావని.. ఆ భూములు పరిశ్రమల యజమానులవేనని ప్రభుత్వం చెబుతోంది.
అసెంబ్లీ వేదికగా పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు ఈ పాలసీ ప్రయోజనాలను వివరించారు. నగరం మధ్యలో పరిశ్రమలు ఉండటం ద్వారా గాలి నాణ్యత (AQI) క్షీణించడం, భూగర్భ జలాల్లో భారలోహాలు పెరగడం వంటివి చోటు చేసుకొని రాబోయే తరాలకు జన్యు సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఫ్యాక్టర్టీలను నగరం వెలుపలకు తరలించకపోతే.. భావితరాలకు బంగారు గిన్నెలో విషం ఇచ్చినట్టేనని మంత్రి శ్రీధర్ బాబు చేసిన వ్యాఖ్యలు నగరంలోని కాలుష్య తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ఇండ్ల మధ్య పరిశ్రమలుంటే ఏం జరుగుతుందనే దానికి.. భోపాల్ గ్యాస్ దుర్ఘటన, విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం లాంటివి ఉదాహరణలుగా చెబుతున్నారు.
ఈ పాలసీ ద్వారా నగరంలో మధ్యలో ఉన్నటువంటి రెడ్, ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలికి తరలించడం ద్వారా నగరాన్ని కాలుష్య కాటు నుంచి కాపాడాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ భూముల మార్పిడి కోసం సబ్-రిజిస్ట్రార్ ఆఫీస్ రేటులో 30 శాతం నుంచి 50 శాతం వరకు ఫీజు వసూలు చేస్తారు. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.10,776 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. ఈ నిధుల్లో 25 శాతాన్ని ఓఆర్ఆర్ వెలుపల కొత్త పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి కేటాయిస్తారు. ఇది బలవంతపు చర్య కాదని, పారిశ్రామికవేత్తలు స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి స్పష్టం చేశారు. అప్లికేషన్ నుంచి రెగ్యులరైజేషన్ వరకు అన్నింటికీ కాలపరిమితి విధించి వ్యవస్థను వేగవంతం చేసినట్లు తెలిపారు.
'భారీ కుంభకోణం' ఆరోపణలు
అయితే బీఆర్ఎస్, బీజేపీలు ఈ పాలసీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. హిల్ట్ పాలసీ పేరుతో పారిశ్రామిక భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ధారాదత్తం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. వేల కోట్ల రూపాయల భూములను తక్కువ ధరకే కన్వర్ట్ చేసి.. అధికార పార్టీ నేతలు లాభపడాలని చూస్తున్నారని విమర్శిస్తున్నారు. ప్రస్తుత మార్కెట్ ధరలకు ప్రభుత్వం వసూలు చేస్తున్న కన్వర్షన్ ఫీజుకు పొంతన లేదని బీజేపీ అంటోంది. ప్రభుత్వ భూములను అగ్గువకు అమ్మేయటానికి చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. 9 వేల ఎకరాలను రియల్ ఎస్టేట్ జోన్లుగా మార్చడం ద్వారా బిల్డర్లకు మాత్రమే ప్రయోజనం చేకూరుతుందని ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి.
ఈ ఆరోపణలను రేవంత్ సర్కార్ తిప్పికొడుతోంది. ఈ పాలసీ పునాదులు ఉమ్మడి రాష్ట్రంలోనే పడ్డాయని.. కాలుష్యాన్ని కలిగించే పరిశ్రమలను ఓఆర్ఆర్ వెలుపలకు తరలించాలని 2013లో కమిటీ నివేదిక ఇచ్చిందని ప్రభుత్వం చెబుతోంది. నగరంలోని పరిశ్రమలు రింగ్ రోడ్డు వెలుపలకు తరలించి ఆరు ఇండస్ట్రీయల్ పార్కులుగా మార్చడం కోసం 2020లోనే బీఆర్ఎస్ హయాంలోనే గ్రిడ్ పాలసీని ప్రకటించిన విషయాన్ని మంత్రులు గుర్తు చేస్తున్నారు. తాము చేస్తున్నది కేవలం యాజమాన్య హక్కులు ఉన్న ప్రైవేట్ భూముల కన్వర్షన్ మాత్రమేనని, ప్రభుత్వ భూములను అమ్మడం లేదని స్పష్టం చేశారు. కాలుష్య కారక పరిశ్రమలు లీజు భూముల్లో ఉన్నా, సొంత భూముల్లో ఉన్నా కచ్చితంగా తరలించి తీరుతామని తేల్చి చెబుతున్నారు. హిల్ట్ పాలసీ రాష్ట్రానికి మేలు చేస్తుందని మంత్రులు స్పష్టం చేస్తున్నారు.
హిల్ట్ పాలసీని ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ, ఆదాయ మార్గంగా చూస్తుంటే ప్రతిపక్షాలు భూ కుంభకోణంగా పేర్కొంటున్నాయి. నగరాభివృద్ధికి పరిశ్రమల తరలింపు అవసరమే అయినప్పటికీ.. ఈ ప్రక్రియలో పారదర్శకత పాటించడం, భూముల విలువను శాస్త్రీయంగా నిర్ణయించడం ద్వారానే ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హిల్ట్ పాలసీని పారదర్శకంగా మార్చడం కోసం.. రూ.4 లక్షల కోట్లకుపైగా విలువైన భూముల విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని నిరూపించడం కోసం.. ఈ పాలసీ విషయమై మరింతగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ లాంటి నేతలు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa