ఈ నెల 18వ తేదీన ఖమ్మం నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) వందేళ్ల పండుగ బహిరంగ సభకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ చారిత్రాత్మక వేడుకను విజయవంతం చేసేందుకు వివిధ వర్గాల నుండి మద్దతు లభిస్తోంది. అందులో భాగంగా, ఏఐటీయుసీ (AITUC) రాష్ట్ర నాయకత్వం ఈ సభ నిర్వహణ కోసం తమ వంతు సహాయంగా 25 వేల రూపాయల ఆర్థిక విరాళాన్ని ప్రకటించి, పార్టీ పట్ల తమకున్న అంకితభావాన్ని చాటుకుంది.
శుక్రవారం ఖమ్మంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ విరాళానికి సంబంధించిన చెక్కును పార్టీ నాయకులకు అందజేశారు. ఏఐటీయుసీ రాష్ట్ర నాయకులు స్వయంగా విచ్చేసి, సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ ఎండీ మౌలానాకు ఈ మొత్తాన్ని హ్యాండోవర్ చేశారు. పార్టీ శతాబ్ది ఉత్సవాలు కార్మిక వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయని, ఈ సభను రాష్ట్రం గర్వించేలా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ సహకారం అందించినట్లు వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావుతో పాటు జిల్లా కీలక నేతలు పాల్గొని ప్రసంగించారు. జిల్లా కార్యదర్శి దండి సురేష్, జిల్లా సహాయ కార్యదర్శి జే. జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సీపీఐ వందేళ్ల ప్రస్థానం దేశ రాజకీయాల్లో ఒక మైలురాయి అని, దీనిని ఘనంగా చాటిచెప్పేందుకు కార్యకర్తలు శ్రేణులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఆర్థికంగా అండగా నిలిచిన ఏఐటీయుసీ నాయకులకు ఈ సందర్భంగా వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
బహిరంగ సభకు భారీ ఎత్తున జనాన్ని సమీకరించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, ఖమ్మం గడ్డపై ఎర్రజెండా సత్తా చాటుతామని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ సభగానే కాకుండా, సామాన్యుల సమస్యలపై పోరాడే శక్తిని కూడగట్టుకునే వేదికగా ఈ సభ నిలుస్తుందని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొని రాబోయే సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని తీర్మానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa