కొన్నిసార్లు మనం కనే కలలు మనల్ని హెచ్చరిస్తాయేమో అనిపిస్తుంది. అయితే హెచ్చరిక ఇంతటి ఘోర విషాదాన్ని మిగిలిస్తుందని ఆ తండ్రి ఊహించలేదు. ఐదు రోజుల క్రితం ఆ తండ్రికి ఒక పీడకల వచ్చింది.. తన కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు. ‘కలే కదా.. నా బిడ్డకు ఏమీ కాదు’ అని మనసును కుదుటపరుచుకున్న ఆ తండ్రికి.. విధి ఆ కలను నిజం చేసి వెక్కిరించింది. ‘ఒరేయ్ నాన్నా.. జాగ్రత్తగా ఉండు అని చెప్పేలోపే నన్ను అనాథను చేసి పోయావా?’ అంటూ సూర్యతేజ తండ్రి అరుణ్ కుమార్ విలపిస్తున్న తీరు చూస్తుంటే అక్కడున్న వారందరి కళ్లు చెమర్చాయి. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు విగతజీవిగా పడి ఉండటం చూసి.. ‘నీ చావును ముందే కలలో చూసినా ఆపలేకపోయానే’ అంటూ ఆయన గుండెలవిసేలా రోదిస్తుంటే ఆ శ్మశాన వైరాగ్యం మాటల్లో వర్ణించలేము.
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మీర్జాగూడ గేటు వద్ద గురువారం తెల్లవారుజామున ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. పుట్టినరోజు వేడుకలు జరుపుకుని ఆనందంగా తిరిగి వస్తున్న ఐదుగురు విద్యార్థుల జీవితాల్లో ఈ వేడుక చివరి జ్ఞాపకంగా మిగిలిపోయింది. మిత్రుడు సుమిత్ పుట్టినరోజు సందర్భంగా నార్సింగిలో విందు ముగించుకుని అర్ధరాత్రి దాటిన తర్వాత కారులో బయలుదేరారు. కారు అతివేగంగా ఉండటం వల్ల అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందంటే... కారు నుజ్జునుజ్జయి ఇనుప తునకలా మారిపోయింది. కారులో ఉన్న సుమిత్ (20), నిఖిల్ (20), సూర్యతేజ (20), రోహిత్ (18) అక్కడికక్కడే మరణించారు. వెనుక సీట్లో ఉన్న నక్షత్ర అనే యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి గురైన విద్యార్థులందరూ ఉన్నత చదువులు చదువుతూ.. ఉజ్వల భవిష్యత్తు ఉన్నవారే. కానీ ఒక్క క్షణం వేగం వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది.
చనిపోయిన వారిలో..
పుట్టినరోజు నాడే తమను విడిచి వెళ్లిపోవడంతో.. తమకు దిక్కెవరు అంటూ తండ్రి వినయ్ భోరున విలపించారు. ఆ తండ్రికి సుమిత్ ఒక్కడే కొడుకు. నిఖిల్ పరిస్థితి మరీ దయనీయం. కరోనా సమయంలో తండ్రిని కోల్పోయిన ఆ కుటుంబానికి నిఖిల్ ఒక్కడే ఆధారం. ప్రైవేట్ టీచర్గా పనిచేస్తూ కొడుకునే ప్రపంచంగా బతుకుతున్న తల్లి ఇప్పుడు ఒంటరిదైపోయింది. సూర్యతేజ తండ్రి అరుణ్ కుమార్కు జనవరి 5వ తేదీ తన కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు కల వచ్చిందని.. నేడు ఆ కల నిజం అయిందని కన్నీటి పర్యంతం అయ్యాడు. ఎంజీఐటీలో బీటెక్ చదువుతున్న రోహిత్ కూడా ఈ ప్రమాదంలో మరణించాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్జాగూడ గేటు వద్ద ఉన్న బారికేడ్లను తప్పించే క్రమంలో కారు అదుపు తప్పింది. అర్ధరాత్రి పూట రోడ్లు ఖాళీగా ఉండటంతో వాహనాన్ని మితిమీరిన వేగంతో నడపడమే ఈ అనర్థానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను గ్యాస్ కట్టర్ల సాయంతో పోలీసులు బయటకు తీయాల్సి వచ్చింది. ఈ ఘటనతో యువతలో పెరుగుతున్న అత్యుత్సాహం, మితిమీరిన వేగం కుటుంబాలను ఎలా చిన్నాభిన్నం చేస్తున్నాయో అర్థమవుతోంది. చేవెళ్ల ఆస్పత్రి వద్ద మృతుల బంధువుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా శోకసంద్రమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa