ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో కోళ్ల పందేలు.. తెలంగాణ కోళ్లకు గిరాకీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 10, 2026, 08:37 PM

సంక్రాంతి పండుగ వస్తోందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో కోడి పందాల సందడి మొదలవుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగే పందాల కోసం తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పెంచే పందెం కోళ్లకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ఈ జిల్లాల్లోని మారుమూల ఆయిల్ పామ్ తోటలు ఇప్పుడు పందెం కోళ్ల తయారీ కేంద్రాలుగా (బ్రీడింగ్ సెంటర్లు) మారిపోయాయి.


ఆయిల్ పామ్ తోటల్లో సీక్రెట్‌గా శిక్షణ..


భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట, దమ్మపేట, చంద్రుగొండ వంటి మండలాల్లో విస్తారంగా ఉన్న ఆయిల్ పామ్ తోటలు కోళ్ల పెంపకానికి అనువుగా మారాయి. తోటల చుట్టూ ఫెన్సింగ్ వేసి.. సీక్రెట్‌గా షెడ్లను నిర్మించి కోళ్లకు శిక్షణ ఇస్తున్నారు. అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లోనే ఇలాంటివి సుమారు 150కి పైగా ఫామ్ హౌస్‌లు ఉన్నాయని అంచనా. ఇక్కడ పెరిగే కోళ్లు బలంగా, చురుగ్గా ఉంటాయనే నమ్మకంతో పందెం రాయుళ్లు వీటిని మూడు నెలల ముందే బుక్ చేసుకుంటారు.


పందెం కోళ్ల తయారీలో వాటి రంగు, జాతికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. వీటిని కేవలం పక్షుల్లా కాకుండా, యుద్ధ వీరుల్లా పెంచుతారు. భారతీయ దేశీ జాతి అయిన 'అసీల్' (Asil) పందాలకు అత్యంత ప్రసిద్ధి. కోళ్ల రంగును బట్టి వాటిని నెమలి (మల్టిపుల్ కలర్స్), కాకి (నలుపు), డేగ (ఎరుపు), కోడి (తెలుపు) అని పిలుస్తారు. వీటిలో రసంగి, అబ్రాసి, పర్ల వంటి ఉప రకాలు కూడా ఉన్నాయి. ఇటీవల పెరూవియన్ వంటి విదేశీ జాతులను కూడా సంకరం చేసి కొత్త రకాలను సృష్టిస్తున్నారు. పందెం కోళ్లకు ఇచ్చే ఆహారం మనుషుల కంటే ఖరీదైనదిగా ఉంటుంది. బలం కోసం వీటికి బాదం పప్పులు, జీడిపప్పు, ఉడికించిన కోడిగుడ్లు, రాగులు, మటన్ కీమా వంటి పోషకాహారాన్ని అందిస్తారు. ఒక కోడిపై ఏడాదికి సుమారు 10 వేల నుండి 30 వేల రూపాయల వరకు ఖర్చు చేస్తారు.


పందెం కోడి నాణ్యతను బట్టి దాని ధర 5 వేల రూపాయల నుండి మొదలై గరిష్టంగా 2 లక్షల రూపాయల వరకు పలుకుతుంది. భారతదేశంలో జంతు హింస నిరోధక చట్టం 1960 ప్రకారం కోడి పందాలు నిర్వహించడం చట్టవిరుద్ధం. 2018లో సుప్రీంకోర్టు కత్తులు కట్టకుండా.. బెట్టింగులు లేకుండా సంప్రదాయబద్ధంగా పందాలు నిర్వహించుకోవచ్చని అనుమతించింది. కానీ.. క్షేత్రస్థాయిలో మాత్రం కోళ్లకు పదునైన కత్తులు కట్టి, కోట్ల రూపాయల జూదం నిర్వహిస్తుంటారు. రాజకీయ అండదండలు కూడా ఉండటంతో పండగ మూడు రోజులు ఈ పందాలు జోరుగా సాగుతాయి. అశ్వారావుపేట, దమ్మపేటతో పాటు ములకలపల్లి, పాల్వంచ, కొత్తగూడెం, ఇల్లందు వంటి ప్రాంతాల్లో ఈ వ్యాపారం ఇప్పుడు అతి భారీగా సాగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa