ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘నాకు విషమిచ్చి చంపేయండి’... మీడియాలో వస్తున్న ఆరోపణలపై మంత్రి కోమటిరెడ్డి ఆవేదన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 10, 2026, 08:54 PM

తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాలో వస్తున్న కొన్ని కథనాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘మీ వ్యూస్, రేటింగ్స్ కోసం మహిళా అధికారుల మీద అవాస్తవాలు రాసి మానసిక హింస పెట్టకండి.. ఇది కూడా సరిపోదు అనుకుంటే నాకింత విషమిచ్చి చంపేయండి’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. మహిళా ఐఏఎస్ అధికారులపై, తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ ఆయన శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.


మంత్రి తన ఆవేదనలో ప్రధానంగా మహిళా అధికారుల ఆత్మగౌరవం గురించి ప్రస్తావించారు. ఐఏఎస్ అధికారులు ఎంతో కష్టపడి ఆ స్థాయికి చేరుకుంటారని.. కేవలం ఛానళ్ల మధ్య పోటీ కోసం వారి వ్యక్తిగత జీవితాలను రోడ్డుపైకి లాగడం సరికాదని హితవు పలికారు. ప్రతి ఒక్కరికీ కుటుంబం ఉంటుందని, ఆధారం లేని వార్తల వల్ల వారు ఎంతటి మానసిక వేదనకు గురవుతారో ఆలోచించాలని కోరారు. ఈ ఆరోపణల వెనుక ఉన్న నిజానిజాలను తేల్చేందుకు ప్రభుత్వం తరపున సమగ్ర విచారణ జరిపించాలని ముఖ్యమంత్రిని కోరతానని మంత్రి స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు చూశానని.. తన కుమారుడి మరణం తర్వాత సగం చనిపోయానని కోమటిరెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు.


గత కొంతకాలంగా మంత్రి గొంతు సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. అమెరికా వెళ్లి వైద్యం చేయించుకున్నా ఫలితం లేకపోవడంతో.. వైద్యుల సూచన మేరకు తక్కువగా మాట్లాడుతున్నట్లు వివరించారు. తాను ఫోన్ నంబర్ మార్చానని వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. గత 20 ఏళ్లుగా వాడుతున్న పాత నంబర్ తన వద్దే ఉందని.. అందరూ ఫోన్లు చేస్తుండటంతో దానిని తన పీఏ వద్ద ఉంచానని క్లారిటీ ఇచ్చారు. ఆ నంబర్ ద్వారానే తాను ఆరుసార్లు ఎన్నికల్లో గెలిచానని గుర్తు చేశారు.


కలెక్టర్ల బదిలీలు ముఖ్యమంత్రి పరిధిలో జరుగుతాయని.. ఇందులో మంత్రుల ప్రమేయం ఉండదని చెప్పారు. నల్గొండ జిల్లాలో నలుగురు కలెక్టర్లు మారిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇది పరిపాలనాపరమైన ప్రక్రియే తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని తేల్చి చెప్పారు. తన కొడుకు పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి సమాజ సేవ చేస్తున్న తనపై ఇలాంటి బురదజల్లడం సరికాదని ఆయన మీడియా మిత్రులకు విన్నవించారు. తనను ఎంతైనా విమర్శించవచ్చని.. కానీ అధికారులను వివాదాల్లోకి లాగొద్దని ఆయన కోరారు.


ఇదిలా ఉండగా.. తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పెద్ద సినిమాల టికెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, ఈ నిర్ణయంతో తనకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. 'పుష్ప-2' విడుదల సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని.. ఆ బాధతోనే సినీ పరిశ్రమ వ్యవహారాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇకపై రేట్ల పెంపు కోసం ఎవరూ తన వద్దకు రావద్దని సినీ పెద్దలకు ముందే తేల్చి చెప్పానని.. అందుకే వారు ఇప్పుడు తనను కలవడం లేదని వెల్లడించారు. ఈ వ్యవహారాలన్నీ తన పరిధిలో లేవని ఆయన కుండబద్దలు కొట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa